ప్రేమజంట బలవన్మరణం | Couple Commit Suicide in Yadadri Railway Track | Sakshi
Sakshi News home page

రైల్వే ట్రాక్‌పై ప్రేమ జంట ఆత్మహత్య ..

Mar 11 2018 3:43 AM | Updated on Nov 6 2018 7:53 PM

Couple Commit Suicide in Yadadri Railway Track - Sakshi

గణేశ్, పూజిత(ఫైల్‌)

రామన్నపేట (నకిరేకల్‌): ప్రేమను పెద్దలు ఒప్పు కోకపోవడంతో కలసి ఉండలేమని భావించిన ఓ ప్రేమజంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్‌కి చెందిన చిరబోయిన గణేశ్‌(22), అదేగ్రామానికి చెందిన పూజిత(16) ప్రేమించుకున్నారు. పూజిత 10వ తరగతి చదువుతుండగా, గణేశ్‌ ఇంటర్‌ పూర్తిచేసి లారీ డ్రైవర్‌ అయిన తండ్రి అయిలయ్యకి సహాయంగా ఉంటున్నాడు. గత దసరా పండుగకు కొద్దిరోజుల ముం దు గణేశ్, పూజిత ప్రేమ వ్యవహారం కుటుంబసభ్యులకు తెలిసింది.

కులాలు వేరుకావడంతో ఇరువురి తల్లితండ్రులు, కులపెద్దలు మందలించారు. ఈ క్రమంలో శుక్రవారం  స్కూలుకు వెళ్తానని పూజిత, లారీ వద్దకు వెళ్తానని గణేశ్‌ బయటకు వెళ్లారు. పూజిత స్కూల్‌కు వెళ్లలేదని సాయంత్రం తెలియడంతో బంధువుల ఇళ్లలో వెతికారు. ఎక్కడా ఆచూ కీ తెలియకపోవడంతో కూతురును కిడ్నాప్‌ చేశారని తండ్రి బొంత శంకరయ్య అదే రోజు నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చిట్యాల మండలం వట్టిమర్తి శివారులోని సాయిబాబాగుడి సమీపంలో వీరున్నట్లు తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు.

పోలీసుల రాకను గమనించి వారు అక్కడే బైక్‌తోపాటు బ్యాగును వదిలివెళ్లారు. ఆ రోజు రాత్రం తా వెతికినా దొరకలేదు. తమకోసం వెతుకుతున్నారని తెలుసుకున్న గణేశ్, పూజిత రామన్నపేట శివారులోని జేపీగార్డెన్స్‌ ఎదురుగా ఉన్న రైల్వేట్రాక్‌ మీద శుక్రవారం రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ఈ విషయం గమనించిన అమరావతి ఎక్స్‌ప్రెస్‌ గార్డ్‌ స్థానిక స్టేషన్‌మాస్టర్‌కు సమాచారమందించారు.  

Advertisement
 
Advertisement
Advertisement