పెరుగుతున్న చీటీల మోసాలు | Cheating Cases Hikes In Chittoor | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న చీటీల మోసాలు

Nov 10 2018 11:28 AM | Updated on Nov 10 2018 11:28 AM

Cheating Cases Hikes In Chittoor - Sakshi

మాలిక్‌ బంగారు నగలు ఇస్తానని వేసిన రూ.550ల చీటీ కార్డు మాలిక్, చీటీల నిర్వాహకుడు

కొందరు చీటీల పేరుతో అమాయకులను నిలువునా మోసం చేస్తున్నారు. దీపావళి చీటీ.. సంక్రాంతి చీటీ..అయ్యప్పస్వామి చీటీ, అమావాస్య చీటీ.. పౌర్ణమి చీటీ అంటూ గ్రామాల్లో నిర్వహిస్తున్నారు. కొద్ది
రోజులు డబ్బులు చెల్లించి నమ్మకం ఏర్పరుచుకుంటున్నారు. తర్వాత లక్షలు తీసుకుని కనిపించకుండాపోతున్నారు. దీంతో అమాయకులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

చిత్తూరు, పిచ్చాటూరు:పిచ్చాటూరు పట్టణంలో పది రోజుల క్రితం దీపావళి చీటీ వేసిన మాలిక్‌ వెయ్యి కుటుంబాలను మోసం చేసి రూ.70 లక్షలతో పరారయ్యాడు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన షఫీ చీటీలు వేసి సుమారు రూ.50 లక్షలతో ఉడాయించాడు. వారి ఆచూకీ తెలియకపోవడంతో భాధితులకు కన్నీరే మిగిలింది.

మాయమాటలతో బురిడీ
సాధారణంగా చీటీల వ్యాపారం చేయాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కొంద రు ప్రజల అవసరాలు, వారి అమాయక త్వాన్ని ఆసరాగా తీసుకుని చీటీల వ్యాపారం చేస్తున్నారు. వారికి అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో చీటీలు వేసి ప్రారంభంలో నష్టం వచ్చినా పెట్టుబడి అనుకొని సభ్యులకు మొత్తాన్ని సక్రమంగా ఇస్తూ వారికి నమ్మకం కలిగేలా చేస్తారు. అందరికీ నమ్మ కం వచ్చి ఎక్కువ మంది చీటీలో చేరి భారీ మొత్తంలో డబ్బులు పోగయ్యాక తమ చేతివాటం చూపిస్తున్నారు. రాత్రికి రాత్రి డబ్బులతో ఉడాయిస్తున్నారు. బాధితులు ఎంత గగ్గోలు పెట్టినా డబ్బులు మాత్రం తిరిగిరావు.

అక్రమ చీటీ వ్యాపారులపైకఠినంగా వ్యవహరించాలి
ఎక్కడైనా అక్రమంగా చీటీలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. పొదుపు చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చీటీలు వేస్తే ఇలా డబ్బులతో ఉడాయించడంపై మండిపడుతున్నారు. ఇకపై చీటీలు వేసే వారితో కఠినంగా వ్యవహరించి అనుమతి లేకపోతే చర్యలు చేపట్టాలని ప్రజలు పోలీసులకు విజ్నప్తి చేస్తున్నారు.

ప్రజలను చైతన్యపరచాలి
చీటీ వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్య పరచాలని మేధావులు అంటున్నారు. అన్నీ తెలిసి ఓ స్థాయిలో ఉన్న డాక్టర్లు, ఇంజినీర్లే మోసపోతున్నారని, ఇక గ్రామీణ ప్రజలను బురిడీ కొట్టించడం చీటీ వ్యాపారస్తులకు పెద్ద పనేంకాదని పరిశీలకులు అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చీటీ నిర్వాహకులపై ఉక్కుపాదం మోపడం ద్వారానే చీటీల వ్యవస్థను సమూలంగా నిర్మూలించవచ్చని వారు చెబుతున్నారు.

చీటీల మోసంపై పోలీసుల విచారణ
పిచ్చాటూరు:మండల కేంద్రమైన పిచ్చాటూరులో వెలుగులోకి వచ్చిన మాలిక్‌ చీటీల మోసంపై సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు స్థానిక ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు. ‘చీటీల చీటింగ్‌’ అన్న శీర్షికన సాక్షి దినపత్రికలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎస్‌ఐ రెండు రోజుల్లో చీటీలు వేసిన వారి వివరాలు, మాలిక్‌ కుటుంబం నేపథ్యం తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం విచారణ చేపడతామని తెలిపారు. 

చీటీల నిర్వాహకుడుమాలిక్‌పై ఫిర్యాదు
దీపావళి చీటీల నిర్వాహకుడు మాలిక్‌పై పిచ్చాటూరుకు చెందిన కె.శాంతి అనే మహిళ శుక్రవారం సాయంత్రం పోలీ సులకు ఫిర్యాదు చేశారు. తాను 33 మందితో చీటీలు కట్టిం చా నని, ప్రతి నెలా ఒక్కొక్కరి నుంచి రూ.9950 చొప్పున  33 మంది నుంచి వసూలు చేసి డబ్బు మాలిక్‌కు ఇచ్చినట్టు తెలిపారు. ఈ లెక్కన ఇప్పటి వరకు రూ.1,19,400 అతనికి ఇచ్చినట్టు పేర్కొన్నారు. అతను వస్తువులు ఇవ్వకుండా పారిపోవడంతో సభ్యులు తన ఇంటిని ముట్టడించే పరిస్థితి తలెత్తిందన్నారు. మాలిక్‌పై కేసు నమోదు చేయడంతో పాటు అతని ఆచూకీ తెలుసుకుని న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా ఇంకా బాధితులు ఫిర్యాదు చేయడానికి సమాయత్తమవుతున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement