వెంటాడి.. వేటాడి | Chase...Hunt | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Mar 15 2018 8:34 AM | Updated on Jul 30 2018 8:41 PM

Chase...Hunt - Sakshi

రోదిస్తున్న సురేశ్‌ భార్య, కుటుంబ సభ్యులు..ఇన్‌సెట్లో మృతుడి సురేష్‌ ఫైల్‌ ఫోటో

మేడిపెల్లి(వేములవాడ): వివాహేతరం సంబంధం యువకుడి ప్రాణం తీసింది. పలుమార్లు సదరు విషయమై మందలించినా వినడం లేదని ఆ మహిళ తండ్రి, సోదరుడు ఆ యువకుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం తొంబర్రావుపేటలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రాగుల సురేశ్‌(31) రెవెన్యూశాఖలో ఉద్యోగిగా చేస్తున్నాడు. ఇతడికి భార్య శైలజ, కూతురు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం సాగుతోంది. ఈ విషయమై సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి సురేశ్‌ను పలుమార్లు హెచ్చరించాడు. అయినా పద్దతి మార్చుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు.  

దారికాసి ఘాతుకం.. 
సురేశ్‌ తన మిత్రుడితో కలిసి ద్విచక్రవాహనంపై బుధవారం విధులకు వెళ్తున్నాడు. అదే సమయంలో గ్రామశివారులో కాపుకాసిన సదరు మహిళ తండ్రి నల్ల గంగారెడ్డి, సోదరుడు సంతోష్‌రెడ్డి సురేశ్‌పై దాడి చేశారు. మొదట కర్రలతో దాడిచేయగా స్పృహ కోల్పోయాడు. అనంతరం కొడవలితో మెడ, కడుపులో పొడిచి పారిపోయారు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మెట్‌పెల్లి డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, కోరుట్ల సీఐ సతీష్‌చందర్‌రావు, ఎస్సై కిరణ్‌కుమార్‌ ఘటనాస్థలంలో విచారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా నిందితులిద్దరూ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.  
 
దళిత సంఘాల ఆందోళన 
అగ్రవర్ణాల చేతిలో హత్యకుగురైన సురేశ్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని దళిత సంఘాల నాయకులు డిమాండు చేశారు. సురేశ్‌ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మేడిపల్లిలో ఆందోళన చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement