
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో దారుణం చోటు చేసుకుంది. రాజధాని కాబూల్లోని ఓ షియా సాంస్కృతిక కళా వేదిక వద్ద పలు బాంబు పేలుళ్లు చోటు చేసుకొని దాదాపు 40 మంది మృత్యువాతపడ్డారు. 30మందికి పైగా గాయాలపాలయ్యారు. చాలా రోజుల తర్వాత అత్యంత దారుణమైన హింసాత్మక ఘటన ఇదే. అయితే, ఈ దాడులు ఎవరు చేశారనే దానిపై మాత్రం ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. భద్రతా బలగాలు మాత్రం తాలిబన్ ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
కాబూల్ అంతర్గత భద్రతా వ్యవహారాల అధికార ప్రతినిధి నస్రాత్ రహిమి మీడియాతో మాట్లాడుతూ షియా సాంస్కృతిక కళా సెంటర్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని అన్నారు. అఫ్ఘనిస్థాన్లో సోవియెట్ దురాక్రమణకు 38 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ ఓ కార్యక్రమం జరుగుతుండగా ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ‘40మంది చనిపోయినట్లు మా దగ్గర సమాచారం ఉంది. మరో 30 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. అయితే, ఇదే మొత్తం ప్రాణ నష్టంగా చెప్పలేము.. ఇంకా పెరిగే అవకాశం ఉంది’ అని ఆయన అన్నారు.