బైక్‌ల చోరీ.. వాటిపైనే స్నాచింగ్‌

Bike Robbery And Chain Snatching Gang Arrest in Hyderabad - Sakshi

జల్సాల కోసం స్నాచింగ్‌లు

ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్‌

ఆభరణాలు లాక్కొని క్షణాల్లో మాయం

ఇద్దరు స్నాచర్లతోపాటు సొత్తును అమ్మిస్తున్న వ్యక్తి అరెస్ట్‌

రూ. 10 లక్షల విలువైన సొత్తు, వాహనాలు స్వాధీనం

మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు వెల్లడి

గచ్చిబౌలి: జల్సాలకు అలవాటుపడి స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరితో పాటు కొట్టుకొచ్చిన సొత్తును అమ్మిస్తున్న మరో వ్యక్తిని అరెస్టు మాదాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను మాదాపూర్‌ డీసీపీ ఎ.వెంకటేశ్వర్‌రావు శుక్రవారం వెల్లడించారు. మాదాపూర్‌ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అబ్రార్‌నగర్, హస్మత్‌పేట్‌కు చెందిన సోహిల్‌ ఖాన్‌(19), బీదర్‌కు చెందిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఎరుదుగా ఉండే మహ్మద్‌ అమీర్‌ అలియాస్‌ ప్రిన్స్‌ (20)లు జల్సాలకు అలవాటుపడ్డారు. ఇందుకోసం సులువుగా డబ్బు సంపాదించాలని భావించారు. ఎవరికీ అనుమానం రాకుండా బైకులను చోరీ చేసుకొచ్చేవారు. ఆ బైకులపై తిరుగుతూ ఒంటిరిగా వెళ్తున్న మహిళలను టార్గెచే చేసుకొని బంగారు ఆభరణాలను లాక్కెళ్లేవారు. ఈ క్రమం లో ఫిబ్రవరి 8న తెల్లవారుజామున భర్తతో కలిసి వేములవాడకు వెళ్లేందుకు మాదాపూర్‌కు చెందిన స్వరూపరాణి నడుచుకుంటూ వస్తోంది. ఎదురుగా బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను దాటి వెళ్లి తిరిగి వెనుకవైపు నుంచి వచ్చి ఆమె మెడలోని బంగారు పుస్తుల తాడును లాక్కొనిక్ష ణాల్లో ఉడాయించారు.

బాధితురాలి ఫిర్యాదు మే రకు మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేశా రు. సీసీ కెమెరా ఫుటేజీలను చర్లపల్లి జైలు అధికారులకు చూపింపారు. స్నాచింగ్‌లకు పాల్పడింది పాత నేరస్తులు సోహిల్‌ ఖాన్, మహ్మద్‌ అమీర్‌లుగా గుర్తించారు. గతంలో స్నాచింగ్‌లకు పాల్ప డి జైలుకు వెళ్లిన ఇద్దరు మాదాపూర్‌ పీఎస్‌ పరిధిలో మూడు స్నాచింగ్‌లు, బైక్‌ చోరీ, నార్సింగి పీఎస్‌ పరిధిలో ఒక స్నాచింగ్‌కు పాల్పడ్డారు. సోహిల్‌ ఐదు చోరీలతో పాటు గతంలో మార్కెట్‌ పీఎస్‌ పరిధిలో ఒకటి, బేగంపేట్‌ పీఎస్‌ పరిధిలో మూడు, బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో ఒకటి, మహంకాళీ పీఎస్‌ పరిధిలో ఒక స్నాచింగ్‌తో కలిపి 12 కేసుల్లో నిందితుడు. అమీర్‌ గతంలో మార్కెట్, బోయిన్‌పల్లి పీఎస్‌ పరిధిలో రెండు స్నాచింగ్‌లతో కలిపి ఏడు కేసుల్లో నిందితుడు. జమిస్తాన్‌పూర్‌ ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్‌ జావెద్‌(25) చోరీ చేసిన సొత్తును కమీషన్‌ తీసుకొని విక్రయిస్తాడు. నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన 15 తులాల బంగారు ఆభరణాలు, రెండు మోటార్‌ సైకిళ్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఒంటరి మహిళలను గుర్తించి...
సోహిల్, మహ్మద్‌ అమీర్‌లు మొదట బైక్‌ చోరీ చేస్తారు. అనంతరం మహిళలు ఒంటరిగా నడిచే వెళ్లే ప్రాంతాలను గుర్తిస్తారు. ఆయా ప్రాంతాల్లో నడుచుకుంటూ వచ్చే ఒంటరి మహిళలను టార్గెట్‌ చేస్తూ స్నాచింగ్‌లకు పాల్పడతారు.

అప్రమత్తంగా ఉండాలి
ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే మహిళలు నగలు కనిపించకుండా జాగ్రత పడాలని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు సూచించారు. నగలు ధరించకుండా వెళితే మరీ మంచిదన్నారు. సెల్‌ ఫోన్‌లను మాట్లాడుకుంటూ వెళ్లవద్దన్నారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు అనుమానం వస్తే జన సంచారం ఉన్న చోటకి వెళ్లాలన్నారు. ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.    –డీసీపీ వెంకటేశ్వర్‌రావు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top