బ్యూటీషియన్‌ దారుణ హత్య | Beautician Murdered in Tamil Nadu | Sakshi
Sakshi News home page

బ్యూటీషియన్‌ దారుణ హత్య

Jul 22 2019 7:35 AM | Updated on Jul 22 2019 7:35 AM

Beautician Murdered in Tamil Nadu - Sakshi

హత్యకు గురైన శాంతి(ఫైల్‌)

తమిళనాడు, టీ.నగర్‌: కృష్ణగిరి జిల్లా సూళగిరిలో శనివారం బ్యూటీషియన్‌ దారుణ హత్యకు గురైంది. శూలగిరి కేకేనగర్‌ ప్రాంతంలోని ఒక ఇంటిలో 15 రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో దంపతులు అద్దెకు చేరారు. విల్లుపురం జిల్లా శంకరాపురం ప్రాంతం నుంచి ఇక్కడికి ఉపాధి కోసం వచ్చినట్లు ఇరుగుపొరుగు వారితో సదరు మహిళ చెప్పారు. తర్వాత సూళగిరి బజారువీధిలో ఉన్న ఒక బ్యూటీపార్లర్‌లో ఆమె పనిలో చేరారు. విదేశాలలో పని చేస్తున్న ఆమె భర్త ఇటీవలే అక్కడ నుంచి వచ్చినట్లు తెలిపింది.  కొద్ది రోజుల క్రితం ఇద్దరు పిల్లలను సొంత ఊరికి పంపివేశారు. ఉదయం బ్యూటీపార్లర్‌ పనికి వెళ్లే ఆమె రాత్రి ఆలస్యంగా పని ముగించుకుని ఇంటికి వచ్చేది. దీంతో భర్త మాత్రం ఇంటిలో ఉంటూ వచ్చాడు.

శనివారం చాలా సేపు అయినప్పటికీ మహిళ ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానించిన ఇరుగు పొరుగు వారు కిటికీలోంచి తొంగి చూశారు. ఆమె ఇంట్లో ఉన్న కిటికీ ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీని గురించి సమాచారం అందుకున్న సూళగిరి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ జరిపారు. హత్యకు గురైన మహిళ శాంతి (33), ఆమె భర్త ఇళయరాజ (37)గా తెలిసింది. విల్లుపురం జిల్లా శంకరాపురం వడమరుది ప్రాంతానికి చెందిన వీరికి ఇద్దరు పిల్లలున్నారు. విదేశాల్లో పని చేస్తూ వచ్చిన ఇళయరాజా కొన్ని రోజుల క్రితం సొంత ఊరుకు వచ్చాడు. ఆమెను గొంతు నులిమి హత్య చేసి హత్యను దారి మళ్లించేందుకు ఉరికి వేలాడతీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. అదృశ్యమైన ఇళయారాజాను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement