తెలుగుయువత నాయకుడికి బెయిల్‌ మంజూరు | Bail Granted For Telugu Yuvatha Rakesh | Sakshi
Sakshi News home page

తెలుగుయువత నాయకుడికి బెయిల్‌ మంజూరు

Jan 15 2019 10:20 AM | Updated on Jan 15 2019 10:20 AM

Bail Granted For Telugu Yuvatha Rakesh - Sakshi

శ్రీరామినేని రాకేష్‌

బంజారాహిల్స్‌: బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారిని కిడ్నాప్‌ చేసిన ఘటనలో అరెస్టై చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ వైజాగ్‌ యువనేత శ్రీరామినేని రాకేష్‌కు సోమవారం బెయిల్‌ మంజూరైంది. బంజారాహిల్స్‌ పోలీసులు ఈ నెల 9న కిడ్నాప్‌ కేసులో రాకేష్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా 2 వారాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించడంతో  అదే రోజు అతడిని  జైలుకు తరలించారు. 6 రోజుల అనంతరం అతడికి బెయిల్‌ మంజూరైంది. వారానికొకసారి బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అయితే నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ఆయన నేర చరిత్రను తవ్వేందుకు పోలీసులు కస్టడీకి పిటిషన్‌ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది.

 కేసు పూర్వాపరాలు ఇవీ..
విశాఖపట్నం అర్బన్, నక్కవానిపాలెం పీఅండ్‌టీ కాలనీకి చెందిన శ్రీరామినేని రాకేష్‌ వైజాగ్‌ తెలుగు యువత శిక్షణ శిబిరాల సమన్వయకర్తగా పని చేస్తున్నాడు. కేబుల్‌ వ్యాపారం కూడా నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి పరిచయమైన దామోదర్‌ అనే  ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో  రాకేష్‌ తన బంధుమిత్రుల నుంచి రూ.5 లక్షలు చొప్పున మొత్తం రూ.50 లక్షలు వసూలు చేశాడు. ఎంతకూ ఉద్యోగం రాకపోవడంతో వారు రాకేష్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో రాకేష్‌ తనకు హామీ ఇచ్చిన దామోదర్‌ను నిలదీయడమేగాక, తాను ఇచ్చిన డబ్బులకు గాను వ్యవసాయభూమి రాసివ్వాల్సిందిగా డిమాండ్‌ చేశాడు.  హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 సాగర్‌ సొసైటీలో ఉంటున్న తన బాబాయ్‌ కుమారుడు సుంకు బాలాజీ కుమార్‌ సంతకాలు పెడితేనే ఆ భూమి వస్తుందని చెప్పాడు. దీంతో రాకేష్‌ గత నెల 13న తన అనుచరులు ముగ్గురిని కారులో హైదరాబాద్‌కు పంపించి బాలాజీ కుమార్‌ను కిడ్నాప్‌ చేయించాడు.

అనం తరం అతడిని పిడుగురాళ్లకు తీసుకెళ్లి ఓ గది లో బంధించి తీవ్రంగా హింసించాడు. 14న మరో కారులో బాలాజీకుమార్‌ను వైజాగ్‌ తీసుకెళ్లి అక్కడ బంధించారు. రాకేష్‌ అక్కడికి వచ్చి వైజాగ్‌ తన అడ్డా అని తనను ఎవ రూ ఏమి చేయలేరని మీ తండ్రికి ఫోన్‌ చేసి రమ్మనాలని సూచించాడు. బాలాజీకుమార్‌ తండ్రి రమేష్‌బాబును కూడా కిడ్నాప్‌ చేసి పెద్ద ఎత్తున డబ్బు లాగాలని రాకేష్‌ పథకం వేశారు. అయితే దామోదర్, రాకేష్‌కు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని తెలియడంతో రాకేష్‌ 15వ తేదీన బాలాజీకుమార్‌ను వదిలి వేశాడు. అప్పటికే తమ బంధీలో ఉన్న బాలాజీకుమార్‌ నుంచి రాకేష్‌ బలవంతంగా స్టాంప్‌ పేపర్ల మీద సంతకాలు తీసుకున్నాడు. బంగారు గొలుసులు, ఉంగరాలు లాక్కున్నాడు. పేటీఎం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు కూడా డ్రా చేసుకున్నారు. హైదరాబాద్‌ తిరిగి వ చ్చిన తర్వాత బాలాజీకుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పక్కా నిఘా వేసిన బంజారాహిల్స్‌ పోలీసులు ఈ నెల 8న  వైజాగ్‌లోని తన ఇంటికి వచ్చిన రాకేష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్ట్‌చేశారు. మర్నాడు అతడిని రిమాండ్‌కు తరలించారు. కోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement