పేకాట డబ్బులు అడిగినందుకు..

Auto Driver Killed in Hyderabad For Cards Money - Sakshi

ఆటో డ్రైవర్‌ దారుణ హత్య

స్నేహితులే నిందితులు

బంజారాహిల్స్‌: పేకాటలో గెలిచిన రూ.500  ఇవ్వాలని ఒత్తిడి చేసినందుకు మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు తమ స్నేహితుడిని చితకబాదడంతో అతను మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హకీంపేట సమీపంలోని జియాస్కూల్‌ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ జావిద్‌ పాషా(26) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి అతను తన స్నేహితులు షేక్‌ సాజిద్, ఇంతియాజ్, నిజాం, సయీద్‌లతో కలిసి సమీపంలోని గుట్టల్లోకి మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతున్నారు. ఈ సందర్భంగా జావిద్‌ పాషా రూ.500 గెలుచుకున్నాడు.

ఈ డబ్బులు ఇవ్వాల్సిందిగా స్నేహితులపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన అతడి స్నేహితులు జావిద్‌పాషాపై మూకుమ్మడిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ముఖంపై బాదడంతో ముక్కు చిట్లింది. నోట్లో ఉన్న పాన్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని హకీంపేట సమీపంలోని అల్‌నూర్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు రాత్రి నానల్‌నగర్‌లోని ఆలీవ్‌ ఆస్పత్రిలో తీసుకెళ్లగా అప్పటికే జావిద్‌ పాషా మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. దీవంతో నలుగురు స్నేహితులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి సోదరుడు షేక్‌ జహంగీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బుధవారం నిందితులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.  నిందితులు షేక్‌ సాజిద్, ఇంతియాజ్, నిజాం, సయీద్‌లపై  క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top