క్షుద్రశక్తుల కోసం మేనత్త దారుణం | Aunt Killed A Girl By Knife In Haryana | Sakshi
Sakshi News home page

క్షుద్రశక్తుల కోసం మహిళ దారుణం

May 7 2018 5:06 PM | Updated on May 7 2018 7:11 PM

Aunt Killed A Girl By Knife In Haryana - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యమునానగర్ (హరియాణా): తనకు వచ్చిన కలను సాకారం చేసుకునేందుకు ఓ మహిళ దారుణానికి పాల్పడింది. క్షుద్రశక్తులు లభిస్తాయన్న దురాశతో మూడేళ్ల చిన్నారిని బలిచ్చింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషాదం హరియాణాలోని యయునానగర్ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. నిందుతురాలికి వివాహమై ఇద్దరు సంతానం ఉన్నారు. భర్తతో కలిసి ఆమె అంబాలాలో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఇటీవల భర్త, పిల్లలతో కలిసి తన పుట్టింటికి వచ్చింది. అయితే ఓ చిన్నారిని బలిదానమిస్తే క్షుద్రశక్తులు వస్తాయని ఎవరో చెబుతున్నట్లుగా ఆమెకు తరచుగా కలలు వస్తుండేవి. నిజంగానే చిన్నారిని బలిస్తే తన కల సాకారం అవుతుందని భావించిన నిందితురాలు తన సోదరుడి మూడేళ్ల కూతుర్ని బలివ్వాలనుకుంది. 

ఆదివారం చిన్నారి తన అత్తవద్దకు రాగా, గదిలోకి తీసుకెళ్లి పూజలు చేసింది. అనంతరం ఓ కత్తితో గొంతుకోసి చిన్నారిని ఆ మహిళ బలిచ్చింది. బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు పాపను రక్షించేందుకు రాగా, వారి నుంచి తప్పించుకుని వెళ్లేందుకు నిందితురాలు యత్నించింది. ఆమెను పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. రక్తస్రావం కావడంతో అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు జగధ్రి పోలీస్ స్టేషన్ ఆఫీసర్ నవీన్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement