ప్రేమజంటపై వధువు బంధువుల దాడి | Attack On Lovers In Nizamabad | Sakshi
Sakshi News home page

ప్రేమజంటపై వధువు బంధువుల దాడి

Oct 4 2018 8:15 AM | Updated on Oct 17 2018 6:10 PM

Attack On Lovers In Nizamabad - Sakshi

ప్రేమ జంట

కుర్చీతో కొట్టడంతో వరుడు రాజుకు గాయాలయ్యాయి. ఇద్దరిపైనా పిడి గుద్దులు గుప్పించారు.

నవీపేట: కులాంతర వివాహం చేసుకుని రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంటపై వధువు బంధువులు దాడి చేశారు. నవీ పేట పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్‌ నవీపేట మండలంలోని నాళేశ్వర్‌ గ్రామానికి చెందిన బేస రాజు(ఎస్సీ), నందిపేట మండలంలోని బీసీ వర్గానికి చెందిన చిలుగూరు నిరీష రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. వివాహానికి నిరాకరించారు. దీంతో పెద్దలను ఎదిరించి, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మానికొల్ల గంగాధర్, డల్ల సురేశ్‌ల సహకారంతో ఎడపల్లి మండలంలోని జాన్కంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం పెళ్లి చేసుకున్నారు.

అనంతరం రక్షణ కల్పించాలంటూ నవీపేట పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇరువురు మేజర్‌లే కావడంతో ఈ విషయమై ఇరువురి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఆవేశంతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన వధువు తల్లి నాగమణి, అన్న మారుతి, సాయి (వరుసకు అన్న)లు ప్రేమజంటపై దాడి చేశారు. కుర్చీతో కొట్టడంతో వరుడు రాజుకు గాయాలయ్యాయి. ఇద్దరిపైనా పిడి గుద్దులు గుప్పించారు. అడ్డుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్‌ బాబునాయక్‌పైనా దాడి చేశారు. అక్కడే ఉన్నఎమ్మార్పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి డల్ల సురేశ్‌తో పాటు మరో మహిళ యెలుమల గంగామణిని దుర్భాషలాడారు. 

రక్షణ కల్పిస్తాం..
ప్రేమ జంటతో పాటు కానిస్టేబుల్, మరో ఇద్దరిపై దాడి చేసిన వధువు తల్లి నాగమణి, అన్నయ్యలు మారుతి, సాయిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రేమ జంటకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement