ఢిల్లీలో హత్య...ఉత్తరాఖండ్‌లో మకాం?

shashwat pande - Sakshi

సాక్షి, డిల్లీ : గత ఏడాది ఢిల్లీలో ఓ డాక్టర్‌ను హత్య చేసి కలకలం సృష్టించిన సూయూష్‌ గుప్తా అనే నిందితుడు ఉత్తరాఖండ్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఓ లాడ్జ్‌లో అతడు దాగి ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. గుప్తా తన తోటి వైద్యుడు, స్నేహితుడైన డాక్టర్‌ శశ్వత్‌ పాండేను గతేడాది (2017) ఆగస్ట్‌లో గొంతు కోసి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పరరాయ్యాడు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఇప్పటి వరకు పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. పలుమార్లు అతడి కుటుంబానికి నోటీసులు పంపినా, అతని కోసం గాలింపు చేపట్టినా, చివరకు లక్ష రూపాయల రివార్డును ప్రకటించినా అతడి జాడ లేకపోయింది.

 అయితే తాజాగా అతడి ఆచూకీపై ఓ పోలీసు అధికారి వెల్లడిస్తూ, ‘అతను గతేడాది ఆగస్ట్‌లో హరిద్వార్‌ లోని ఒక లాడ్జ్‌లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. కానీ అప్పటి నుంచి ఆచూకీ లభించలేదు. గుప్తా అక్కడ ఉన్నప్పుడు తన ఫోన్‌ను అక్కడ పనిచేసే వ్యక్తికి ఇచ్చి, ఏడాది తరువాత స్విచ్చాన్‌ చేయమన్నాడు. కానీ అతను మాత్రం నవంబర్‌లోనే ఆన్‌ చేశాడు. సిగ్నల్స్‌ ద్వారా దాన్ని ట్రేస్‌ చేసి పట్టుకున్నాము. కానీ అప్పటికే అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పాండేను చంపేముందు గుప్తా తన అకౌంట్‌లో నుంచి 8లక్షల రూపాయలను డ్రా చేశాడు. గుప్తాకు పాండే తప్ప మరో స్నేహితుడు లేడు. త్వరలోనే ఒక బృందాన్ని ఉత్తరఖాండ్‌కు పంపిస్తాం’ అని పోలీసు అధికారి తెలిపారు.​​​​​​

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top