ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం | 5 Year Old Girl Molested In Maheshwaram | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం

Nov 19 2019 8:55 AM | Updated on Nov 19 2019 8:55 AM

5 Year Old Girl Molested In Maheshwaram - Sakshi

సాక్షి, మహేశ్వరం: కఠినమైన చట్టాలు తీసుకొచ్చినా చిన్నారులపై అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నా యి. తాజాగా ఓ దుర్మార్గుడు అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సోమవారం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహేశ్వరం పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఐదేళ్ల చిన్నారి స్థానికంగా అంగన్‌వాడీ కేంద్రంలో చదువుతోంది. ఆదివారం ఆమె తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు.

మధ్యాహ్నం చిన్నారి ఇంట్లో ఆడుకుంటుండగా పొరుగింటికి చెందిన మోడి చందు(21) ఆమె వద్దకు వచ్చాడు. మాయమాటలు చెప్పి అఘాయిత్యం చేశాడు. అనంతరం అతడు ఇంట్లో నుంచి బయటకు  వస్తుండగా బాలిక తల్లి గమనించి యువకుడిని ప్రశ్నించగా నీళ్లు నమిలాడు. దీంతో అతడిని పట్టుకొని దేహశుద్ధి చేసింది. కూతురిని పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించింది. అనంతరం నిందితుడు పరారయ్యాడు. అదే రోజు రాత్రి మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిని గ్రామస్తులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో అత్యాచారం చేసినట్లు అంగీకరించాడు. చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోమవారం నిందితుడిపై అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకన్ననాయక్‌ తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement