వొడాఫోన్‌ లాభం రూ. 9,805 కోట్లు

Vodafone profit of Rs. 9,805 crores - Sakshi

వచ్చే నెల కల్లా ఐడియాతో విలీనం పూర్తి !  

వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈఓ కొలావో వెల్లడి

న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం వొడాఫోన్‌ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.9,805 కోట్ల నిర్వహణ లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.30,690 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయని వొడాఫోన్‌ తెలిపింది. ఐడియా సెల్యులార్‌తో విలీనం వచ్చే నెల కల్లా పూర్తవ్వగలద  ని అంచనాలున్నాయని వొడాఫోన్‌ గ్రూప్‌ సీఈఓ కొలావో పేర్కొన్నారు. బహుశా ఇవే తమ చివర స్టాండలోన్‌ ఫలితాలు కావచ్చని వ్యాఖ్యానించారు.  

86 శాతం తగ్గిన డేటా చార్జీలు...
టారిఫ్‌ల యుద్దం తమపై తీవ్రంగానే ప్రభావం చూపించిందని కొలావో అంగీకరించారు. మొబైల్‌ టర్మినేషన్‌ చార్జీలను తగ్గించడం మరింత ప్రతికూల ప్రభావం చూపించిందని తెలిపారు. 2016–17లో రూ.42,927 కోట్లుగా ఉన్న సేవల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో 19 శాతం క్షీణించి రూ.35,045 కోట్లకు పడిపోయిందని వివరించారు.

తీవ్రమైన పోటీ కారణంగా డేటా చార్జీలు 86 శాతం తగ్గాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో కోటి మంది కొత్త వినియోగదారులు లభించారని, దీనికి చాలా ఖరీదైన మూల్యం చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. ఇదే క్వార్టర్‌లో 5.76 లక్షల పోస్ట్‌–పెయిడ్‌ వినియోగదారులను కోల్పోయామని తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top