తెలంగాణలో టఫే ప్లాంటు | Taffe plant in Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో టఫే ప్లాంటు

Feb 10 2018 12:44 AM | Updated on Feb 10 2018 12:05 PM

Taffe plant in Telangana - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ట్రాక్టర్ల తయారీలో ఉన్న ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టఫే) తెలంగాణలో హై ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. హై ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌తో తక్కువ నీటి వినియోగం, తక్కువ ఎరువు వాడకం, విత్తనాలు, మొక్కలు సరైన రీతిలో నాటేందుకు వీలవుతుంది.

కంపెనీ విదేశాల్లో ఉన్న ప్లాంట్లలో వీటిని తయారు చేసి విక్రయిస్తోంది. యూనిట్‌ కార్యరూపంలోకి వస్తే భారత్‌లో టఫేకు ఇది తొలి కేంద్రం అవుతుంది. ఈ యంత్రాల తయారీ యూనిట్‌ కోసం తొలుత రూ.200 కోట్ల వరకు పెట్టుబడి అవసరం ఉండొచ్చని టఫే ప్రొడక్ట్‌ స్ట్రాటజీ ప్రెసిడెంట్‌ టి.ఆర్‌.కేశవన్‌ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. విదేశీ కంపెనీల సహకారంతో వీటిని భారత్‌లో తయారు చేస్తామన్నారు.

రైతులకు ఉచిత సేవలు..
తమిళనాడు, రాజస్థాన్‌లో టఫే జేఫామ్స్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ విత్తన పరిశోధన చేస్తారు. తక్కువ రోజులకు పంట చేతికొచ్చే కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకంపై  రైతులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తారు. అవసరమైన వ్యవసాయ పరికరాలను అభివృద్ధి చేస్తారు. టఫే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద జేఫామ్‌ సేవలన్నీ రైతులకు ఉచితంగా అం దిస్తోంది.

అస్పాం, తెలంగాణలో సైతం జేఫామ్‌ ఏర్పాటు చేసేందుకు కంపెనీ ముందుకు వచ్చింది. 50 హెక్టార్ల స్థలం సమకూర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కంపెనీ కోరింది. 30 సంవత్సరాల తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇస్తామని కేశవన్‌ తెలిపారు. తెలంగాణలో ఎఫ్‌2ఎఫ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అద్దెకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు కావాల్సిన వారు ఈ పోర్టల్‌ ద్వారా సేవలు పొందవచ్చు. 

Advertisement
 
Advertisement
Advertisement