ఐదు వారాల్లో అతిపెద్ద పతనం | Sensex posts biggest fall in five weeks | Sakshi
Sakshi News home page

ఐదు వారాల్లో అతిపెద్ద పతనం

Mar 28 2016 4:49 PM | Updated on Jul 11 2019 8:55 PM

ఐదు వారాల్లో అతిపెద్ద పతనం - Sakshi

ఐదు వారాల్లో అతిపెద్ద పతనం

అంచనాలకనుగుణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. నాలుగు రోజుల విరామం తర్వాత ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీగా నష్టపోయాయి

ముంబై:  అంచనాలకనుగుణంగానే దేశీయ స్టాక్ మార్కెట్లు  సోమవారం భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.  నాలుగు రోజుల  విరామం తర్వాత ప్రారంభమైన  స్టాక్ మార్కెట్లు  ఈ రోజు భారీగా నష్టపోయాయి. ఒకదశలో 400  పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివర్లో కొద్దిగా కోలుకుంది.  లాభాల స్వీకరణ,  ఫెడ్ వడ్డీరేట్ పెంపుభయం, భారత కరెన్సీ రూపాయి బలహీనత భారత ఈక్విటీ మార్కెట్లను నష్టాల బాట పట్టించాయి.  25,417 దగ్గర  ప్రారంభమైన సెన్సెక్స్  371 పాయింట్ల  నష్టంతో 24,966 దగ్గర, నిఫ్టీ   100 పాయింట్ల నష్టంతో  7,615దగ్గర ముగిసింది. దాదాపు అన్ని ప్రధాన రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. రియాల్టీ, ఫార్మా రంగాల్లోని నష్టాలు మార్కెట్ ను ప్రభావితం చేశాయి.  
ఇటీవల లాభాలతో జోరుమీదున్న మార్కెట్లు , ఐదువారాల అతి భారీ పతనానికి చేరుకున్నాయి.  మార్చి నెల డెరివేటివ్ కాంట్రాక్టు గడువు గురువారంతో ముగియనుండటం కూడా మదుపర్లను ఆలోచనలో పడవేసింది. ఫలితంగా సెన్సెక్స్ పాతిక వేలకు పైన, నిఫ్టీ కీలక మద్దతుస్థాయి 7,700 పాయింట్లకుపైన  నిలదొక్కుకోవడంలో విఫలమయ్యాయి.

 అటు వచ్చేనెల 5న ఆర్‌బీఐ వచ్చే ఆర్థిక సంవత్సరపు తొలి ద్వైమాసిక ద్రవ్యపరపతి సమీక్షను ప్రకటించనుంది.  రిజర్వు బ్యాంక్ పరపతి సమీక్ష,  అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తదితర విషయాలు పరిశీలించాల్సిన  అంశాలని ఎనలిస్టుల అంచనా. రాబోయే  రోజుట్లో దేశీయ మార్కెట్లు పుంజుకోవడానికి ముందు ఇది స్వల్ప విరామమని, కొంత కరెక్షన్ కు గురయ్యే అవకాశం ఉందని ఎస్   సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ తెలిపారు. ప్రపంచ మార్కెట్ల సంకేతాలతో భారతీయ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement