రూ 81,683 కోట్లకు చెల్లుచీటీ | SBI wrote off bad loans worth over Rs 20,000 crore  | Sakshi
Sakshi News home page

రూ 81,683 కోట్లకు చెల్లుచీటీ

Feb 11 2018 3:47 PM | Updated on Feb 11 2018 3:47 PM

SBI wrote off bad loans worth over Rs 20,000 crore  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ : బడాబాబుల ఎగవేతలకు బ్యాంకులు ఆమోదముద్ర వేశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏకంగా రూ 81,683 కోట్ల రాని బాకీలను రద్దు చేశాయి. వీటిలో అత్యధికంగా ఎస్‌బీఐ రూ 20,339 కోట్లను రానిబాకీలుగా తేల్చేసి చేతులు దులుపుకుంది. ఈ గణాంకాలు ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం జరగకముందువి కావడం గమనార్హం. 2012-13లో పీఎస్‌యూ బ్యాంకులు రద్దు చేసిన మొత్తం రూ 27,231 కోట్లుగా నమోదైంది.

గడిచిన అయిదేళ్లలో దాదాపు మూడు రెట్లు అధికంగా మొం‍డి బాకీలను ప్రభుత్వ రంగ బ్యాంకులు తాజాగా రద్దుల పద్దుల చేర్చాయి. ఎస్‌బీఐతో పాటు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ 2016-17లో రూ 9205 కోట్లను, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ 7346 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ 5,545 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ 4348 కోట్ల మేర రాని బాకీలను రద్దు చేశాయి. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల్లో బ్యాంకులు రద్దు చేసిన రుణాల మొత్తం రూ 53,625 కోట్లకు పెరిగింది.

ఆర్‌బీఐ అంచనాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ 15 శాతానికి పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. బ్యాంకులు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న క్రమంలో పీఎస్‌యూ బ్యాంకులకు రానున్న రెండేళ్లలో రూ 2.11 లక్షల కోట్ల మూలధనం సమీకరించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement