
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 2018 డిసెంబరు నాటికి కంపెనీ వాటా 44–45 శాతానికి చేరుతుందని కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ అంచనా వేస్తోంది. జనవరి–జూన్ కాలంలో 39 శాతం వాటాతో నంబర్ వన్ స్థానంలో ఉన్నట్టు శాంసంగ్ మొబైల్ బిజినెస్ డైరెక్టర్ సుమిత్ వాలియా తెలిపారు. గెలాక్సీ ఏ7ను బుధవారం హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
కంపెనీ స్మార్ట్ఫోన్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 10–11 శాతం వాటాతో టాప్–5లో ఉంటాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 16 కొత్త స్మార్ట్ఫోన్లను భారత్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. త్వరలో నూతన ట్యాబ్లెట్ పీసీలను ప్రవేశపెడతామని వివరించారు. ‘జె’ సిరీస్లో 6 కోట్ల ఫోన్లు విక్రయించామన్నారు. ఈ ఏడాది స్మార్ట్ఫోన్ మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నట్లు సుమిత్ పేర్కొన్నారు.