బ్రెగ్జిట్కు సర్వసన్నద్ధం..! | Regulators mount 'Brexit' vigil, RBI promises liquidity support | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్కు సర్వసన్నద్ధం..!

Jun 23 2016 12:18 AM | Updated on Sep 4 2017 3:08 AM

బ్రెగ్జిట్కు సర్వసన్నద్ధం..!

బ్రెగ్జిట్కు సర్వసన్నద్ధం..!

బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా షేర్లు, బాండ్లు, రూపాయి.. ఒడిదుడుకులకు గురవుతుండటంతో సెబీ, ఆర్‌బీఐ, తదితర నియంత్రణ సంస్థలు అప్రమత్తం అవుతున్నాయి.

ఏ పరిణామాలైనా ఎదుర్కొంటాం
బ్రెగ్జిట్ పై ప్రభుత్వం ధీమా
అప్రమత్తమైన ఆర్‌బీఐ
సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌ల సన్నద్ధం

ముంబై/న్యూఢిల్లీ:  బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా షేర్లు, బాండ్లు, రూపాయి.. ఒడిదుడుకులకు గురవుతుండటంతో సెబీ, ఆర్‌బీఐ, తదితర నియంత్రణ సంస్థలు అప్రమత్తం అవుతున్నాయి. యూరోపియన్ యూనియన్‌లో  కొనసాగాలా? వద్దా అన్న విషయమై నేడు (గురువారం) బ్రిటన్‌లో  రిఫరెండమ్(ప్రజాభిప్రాయ సేకరణ) జరుగుతోంది. వైదొలగాలని బ్రిటన్ నిర్ణయిస్తే అంతర్జాతీయంగా ఫైనాన్స్ మార్కెట్లలో ప్రకంపనలు భారీగా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ పరిణామాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసానిచ్చింది. మరోవైపు  తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడడమే కాకుండా, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ అభయం ఇచ్చింది. కాగా తమ రిస్క్ మేనేజ్‌మెంట్ వ్యవస్థలను కట్టుదిట్టం చేశామని మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు పేర్కొన్నాయి. వివరాలు..,

 పుష్కలంగా ఫారెక్స్ నిల్వలు...
బ్రెగ్జిట్ పరిణామాలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ భరోసానిచ్చింది. ఒకవేళ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే ఏర్పడే పరిణామాలను తట్టుకునే స్థాయిలో తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న సూచనలను బట్టి చూస్తే ఈయూలో బ్రిటన్ కొనసాగే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగినా తట్టుకోగలమని పేర్కొన్నారు. మన దగ్గర 36,000 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, బ్రెగ్జిట్ కారణంగా భారత వాణిజ్యంపై ప్రభావం స్వల్పమేనని వివరించారు. ఆ అంశాలన్నింటి కారణంగా ఎలాంటి కరెన్సీ ఒడిదుడుకులనైనా తట్టుకోగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 ఆర్‌బీఐ అభయం..: బ్రెగ్జిట్ రిఫరెండమ్ కారణంగా  భారత్‌తో సహా అంతర్జాతీయ ఫైనాన్స్ మార్కెట్లలలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  జరిగే పరిణామాలపై ఒక కన్నేసి ఉంచామని ఆర్‌బీఐ పేర్కొంది.  తగిన నిధులు అందుబాటులో ఉండేలా చూడడం, ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితులు సక్రమంగా ఉండేలా చూడడం వంటి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ అభయం ఇచ్చింది.

 సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీల సన్నద్ధత...
బ్రెగ్జిట్ అనిశ్చితి నేపథ్యంలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోవడానికి  నిఘా వ్యవస్థను సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లు మరింత కట్టుదిట్టం చేశాయని ఒక అధికారి వెల్లడించారు. కరెన్సీ డెరివేటివ్స్ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులుంటాయనే అంచనాలున్నాయని పేర్కొన్నారు.  క్యాపిటల్ మార్కెట్లో భారీ పతనం సంభవించడం/ తీవ్రస్థాయిలో ఒడిదుడుకులు చోటు చేసుకోవడం వంటి సంఘటనలు సంభవిస్తే తగిన విధంగా స్పందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆ అధికారి వివరించారు.

మనకు సమస్య ఏంటి?
యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగితే ఆ ప్రభావం ఒక్క యూరప్‌పైనే కాదు...ప్రపంచమంతటా పడుతుంది. ఆర్థిక ఫండమెంటల్స్ మెరుగుపడుతున్నంత మాత్రాన ఇండియా దీనికి మినహాయింపు కాదు. బ్రిటన్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొత్తం యూరప్ ఆర్థిక వ్యవస్థ 16 ట్రిలియన్ డాలర్లు. ఇది అంతర్జాతీయ జీడీపీలో నాల్గవ వంతు. అలాంటిది అక్కడ కల్లోల పరిస్థితులు నెలకొంటే ఇండియా ఎగుమతి మార్కెట్‌కు పెద్ద దెబ్బే.  యూరోపియన్ యూనియన్ భారత్‌కు అతిపెద్ద ఎగుమతుల మార్కెట్. ఈ నేపథ్యంతో  ఆ దేశంతో పాటు యూరప్‌తో వాణిజ్య సంబంధాలున్నందున, మన ఎగుమతులు, కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.

ఎగుమతుల క్షీణత...
బ్రిటన్‌తో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం 14 బిలియన్ డాలర్ల మేర వుంది. ఇందులో 8.83 బిలియన్ డాలర్లు ఎగుమతులుకాగా, 5.19 బిలియన్ డాలర్లు దిగుమతులు. అంటే బ్రిటన్‌తో వాణిజ్యం వల్ల మనకు 3.64 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు వుంది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆ దేశానికి జరిగే ఎగుమతులు రెండేళ్లలో 25 శాతం క్షీణించవచ్చని వాణిజ్య వర్గాలు అంచనావేస్తున్నాయి.

రూపాయిపైనా...: బ్రెగ్జిట్‌తో వర్థమాన దేశాల కరెన్సీలన్నీ క్షీణిస్తాయి. ఇదేబాటలో రూపాయి విలువ కూడా బాగా తగ్గవచ్చని అంచనావేస్తున్నారు. ప్రస్తుతం డాలరుతో 67.5 వద్ద వున్న రూపాయి మారకపు విలువ స్వల్పకాలంలో 69.5 స్థాయికి పడిపోవొచ్చని, కొద్ది నెలల్లో 70 దిగువనకూ పతమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే మనం దిగుమతి చేసుకునే క్రూడ్, బంగారం, వంటనూనెలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు బాగా పెరిగిపోతాయి.

 5-8 శాతం మార్కెట్ పతనం
ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే అమెరికాతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కల్లోలం ఏర్పడుతుందంటూ ఇటీవల అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్‌పర్సన్ జెనెట్ ఎలెన్ చేసిన వ్యాఖ్య అతిశయోక్తి ఏమీ కాదు. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లలో పెద్ద పతనమే సంభవించవచ్చన్న భయాల్ని మార్కెట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి విదేశీ ఇన్వెస్టర్లు రిస్క్ ఆస్తులుగా పరిగణించే భారత్ వంటి వర్థమాన మార్కెట్లలో క్షీణత ఎక్కువగా వుంటుంది. పైగా ఇప్పటికే చాలా దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్ సూచీలు 50% అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నందున, ఇక్కడ ప్రభావం అధికంగా వుంటుందన్న అంచనాలు వున్నాయి. స్వల్పకాలంలో ఫండ్ మేనేజర్లు వ్యూహాల్ని మార్చివేసి, ప్రభుత్వ బాండ్లు, పసిడి తదితరాల్లోకి పెట్టుబడులు మళ్లిస్తారని విశ్లేషకులు అంటున్నారు. స్టాక్ సూచీలు స్వల్పకాలంలో 5-8% మధ్య పతనం కావొచ్చన్న అంచనా వేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement