అంబానీ సరికొత్త ప్లాన్స్‌: ఆర్‌కాం హై జంప్‌ | Sakshi
Sakshi News home page

అంబానీ సరికొత్త ప్లాన్స్‌: ఆర్‌కాం హై జంప్‌

Published Tue, Dec 26 2017 4:20 PM

RCom to exit from SDR framework, to reduce debt by Rs 25,000 crore by March 2018: Anil Ambani - Sakshi

సాక్షి, ముంబై: అనిల్‌ ధీరూభాయ్‌ అంబానీ గ్రూప్‌(అడాగ్‌) ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ మీడియా సమావేశం నిర్వహించారు. రుణభారాన్ని తగ్గించుకోవడానికి అనుసరించనున్న ప్రణాళికలు, వ్యూహాలను ఆయన వివరించారు.  ఇన్‌ స్పెక్ట్రమ్, టవర్, రియల్ ఎస్టేట్ ఆస్తుల అమ్మకం ద్వారా మొత్తం అప్పులను రూ.45వేలకోట్లనుంచి  రూ.6వేలకోట్ల దిగువకు తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.  జనవరి -మార్చి నాటికి అన్ని అప్పులను దశలవారీగా చెల్లిస్తామని వెల్లడించారు.  ప్రీ పేమెంట్స్‌ ద్వారా  రూ.25వేల కోట్లను అప్పులను తగ్గించుకోనున్నామని తెలిపారు. ఈ విషయంలో రుణదాతలు, బాండ్ హోల్డర్లు, వాటాదారులు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. 

వ్యూహాత్మక రుణ పునర్వ్యవస్థీకరణ (ఎస్‌డీఆర్) ప్లాన్స్‌పై  మంగళవారం నిర్వహించిన ఈ సమావేశం నేపథ్యంలో ఆర్‌కాం  షేర్‌ విలువ 41 శాతానికిపైగా లాభపడింది.  కంపెనీ వైర్లెస్ డివిజన్, 39.98 శాతం ఎస్.డి.ఆర్ మెకానిజం నుండి బయటికి వస్తోందని, దీంతో రుణభారాన్ని రూ .25,000కోట్ల  మేర తగ్గించుకుంటామని  పేర్కొన్నారు.  కష్టకాలం ముగిసింది..ఇక ముందున్నదంతా మంచికాలమే అన్ని సంకేతాలివ్వడంతో మిగిలిన అడాగ్‌ గ్రూపు  షేర్లు కూడా ఇదే బాటపట్టాయి.  రిలయన్స్‌ కేపిటల్‌ 5 శాతం , రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 2 శాతం  రిలయన్స్‌ పవర్‌ 3.2 శాతం పుంజుకున్నాయి.

Advertisement
Advertisement