విప్లవాత్మక మార్పులతో భారత్‌ ముందడుగు | Sakshi
Sakshi News home page

విప్లవాత్మక మార్పులతో భారత్‌ ముందడుగు

Published Mon, Nov 4 2019 4:00 AM

PM Modi Attends Aditya Birla Group Golden Jubilee Celebrations In Bangkok  - Sakshi


బ్యాంకాక్‌: భారత్‌ ముఖ రహిత పన్ను మదింపుల వ్యవస్థను అమలు చేస్తోందని, దీంతో పన్నుల వసూళ్లలో వేధింపులు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో ఆర్థిక రంగంలో భారత్‌ చేపట్టిన ముఖ్యమైన సంస్కరణలను ఆయన ప్రస్తావించారు. థాయిలాండ్‌లో ఆదిత్య బిర్లా గ్రూపు కార్యకలాపాలు ఆరంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలతో ప్రధాని మాట్లాడారు.

అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్న గమ్యస్థానాల్లో భారత్‌ కూడా ఒకటని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో 286 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐ) రాబట్టినట్టు తెలిపారు. మూసకట్టు ధోరణిలో, బ్యూరోక్రటిక్‌ విధానంలో పనిచేయడాన్ని భారత్‌ ఆపేసిందన్నారు. ఆరి్థక, సామాజికాభివృద్ధి దిశగా విప్లవాత్మక మార్పులతో ముందుకు వెళుతోందన్నారు. స్నేహపూర్వక పన్ను విధానం కలిగిన దేశాల్లో ఇప్పుడు భారత్‌ కూడా ఒకటని, పన్నుల వ్యవస్థను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేస్తున్నట్టు చెప్పారు.

జీఎస్‌టీ అమలు, తద్వారా ఆర్థిక అనుసంధానత స్వప్నం ఆచరణ రూపం దాల్చడం గురించి వివరించారు. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) అన్నది దళారులు, అసమర్థతకు చెక్‌ పెట్టిందని, ఇప్పటి వరకు డీబీటీ 20 బిలియన్‌ డాలర్ల మేర పొదుపు చేసినట్టు చెప్పారు. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, 5 లక్షల కోట్ల డాలర్ల ఆరి్థక వ్యవస్థగా 2024 నాటికి చేరుకోవడం సహా ఎన్నో అంశాల గురించి ప్రస్తావించారు. దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రధాని వివరించారు.

Advertisement
Advertisement