బహుళజాతి సంస్థల కోసమే ఆ బిల్లు | News about Pesticide Management Bill | Sakshi
Sakshi News home page

బహుళజాతి సంస్థల కోసమే ఆ బిల్లు

Apr 10 2018 12:46 AM | Updated on Apr 10 2018 12:46 AM

News about Pesticide Management Bill - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విదేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చేందుకే ‘పురుగు మందుల నిర్వహణ బిల్లు’ రూపుదిద్దుకుంటోందని పెస్టిసైడ్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్, ఫార్ములేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. దీంతో భారతీయ కంపెనీలకు అండగా ఉన్న ఇన్‌సెక్టిసైడ్స్‌ యాక్ట్‌–1968 నిర్వీర్యం కానుందని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ దవే చెప్పారు.

‘భారత్‌లో పురుగు మందులు విక్రయించాలంటే సెంట్రల్‌ ఇన్‌సెక్టిసైడ్స్‌ బోర్డు వద్ద ఉత్పాదన నమోదు తప్పనిసరి. రిజిస్ట్రేషన్‌ లేకుండానే 2007 నుంచి భారత్‌లో పలు విదేశీ కంపెనీలు 127 ఉత్పత్తులను నేరుగా విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం వీటి వ్యాపారం ఏటా రూ.7,000 కోట్లకు వచ్చి చేరింది. వీటి నాణ్యతను పరీక్షించడం లేదు. వీటి రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేయాల్సిందే’ అని వ్యాఖ్యానించారు.

ఫార్ములేషన్స్‌ వారిచేతుల్లో..
సుమారు 100 మాలిక్యూల్స్‌ను ఎమ్మెన్సీలు తమ చేతుల్లో పెట్టుకుని ఇక్కడి మార్కెట్‌ను శాసిస్తున్నాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా స్మాల్, మీడియం పెస్టిసైడ్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ రాజమహేందర్‌ రెడ్డి తెలిపారు.

కంపెనీలు ఈ ఉత్పత్తులను 10 రెట్ల అధిక ధరలకు అమ్ముతున్నాయని, దీంతో రైతులపై భారం పడుతోందని చెప్పారు. దేశీయ కంపెనీలు చవక ధరల్లో ఉత్పత్తులను తయారు చేస్తున్నాయని గుర్తుచేశారు. ఎమ్మెన్సీల చేతుల్లో ఉన్న ఫార్ములేషన్స్‌ను భారతీయ కంపెనీలు తయారు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఇన్‌సెక్టిసైడ్స్‌ యాక్టులో ఉన్న సెక్షన్‌ 9(4) నిబంధనను కొనసాగించాలని ఫైటోకెమ్‌ ఎండీ వై.నాయుడమ్మ డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement