
కార్ల విక్రయాలు మిశ్రమంగా..
వాహన రంగం కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి...
వడ్డీరేట్లు తగ్గొచ్చన్న అంచనాలతో కొనుగోళ్లు వాయిదా
- కొత్త మోడళ్లతో అమ్మకాలు పుంజుకుంటాయన్న ఆశలు
న్యూఢిల్లీ: వాహన రంగం కష్టాలు కొనసాగుతునే ఉన్నాయి. జూన్లో కార్ల విక్రయాలు మిశ్రమంగా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలు మారుతీ సుజుకీ, హ్యుందాయ్లు ఒక అంకె వృద్ధినే నమోదు చేశాయి. హోండా కార్స్ ఇండియా, టాటా మోటార్స్ కంపెనీలు రెండంకెల వృద్ధిని సాధించగా, మహీంద్రా అండ్ మహీంద్రా, టయోటా కంపెనీల అమ్మకాలు క్షీణించాయి.
వర్షాలపై ప్రతికూల అంచనాలు, వడ్డీరేట్లు తగ్గొచ్చన్న అంచనాలతో వినియోగదారులు తమ కార్ల కొనుగోళ్లను వాయిదా వేయడం తదితర కారణాల వల్ల కార్ల అమ్మకాల జోరు తగ్గిందని టాటా మోటార్స్ ప్రెసిడెంట్(ప్యాసింజన్ వెహికల్స్ బిజినెస్ యూనిట్) మయాంక్ పరీక్ చెప్పారు. ఇప్పటివరకైతే వర్షాలు సాధారణ స్థాయిలో కురవడం, కొత్త మోడళ్లు రానుండడం వంటి కారణాల వల్ల రానున్న నెలల్లో అమ్మకాలు పుంజుకోవచ్చని మహీంద్రా అండ్ మహీంద్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటోమోటివ్ డివిజన్) ప్రవీణ్ షా చెప్పారు.