దళిత పారిశ్రామికవేత్తల నుంచి మరిన్ని కొనుగోళ్ళు!
‘‘ప్రస్తుత ప్రభుత్వ కొనుగోళ్ల విధానం ప్రకారం... కేంద్ర ప్రభుత్వం లేదా విభాగాలు తమ అవసరాల..
♦ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మార్పులు
♦ యూఏఎం వద్ద ఎంఎస్ఎంఈల నమోదు తప్పనిసరి
♦ తెలంగాణలో టీబీఐ, ఎల్బీఐ సెంటర్ల ఏర్పాటుకు ఓకే
♦ ‘స్టార్టప్’ సదస్సులో కేంద్ర మంత్రి కల్రాజ్ మిశ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూర : ‘‘ప్రస్తుత ప్రభుత్వ కొనుగోళ్ల విధానం ప్రకారం... కేంద్ర ప్రభుత్వం లేదా విభాగాలు తమ అవసరాల కోసం చేసే కొనుగోళ్లలో ఏడాదికి కనీసం 20 శాతం కొనుగోళ్లు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి... 4 శాతం ఎస్సీ/ఎస్టీలకు చెందిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి ఉండాలి. కానీ ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు మేలు జరిగేలా ఈ పాలసీలో మరిన్ని మార్పులు చేస్తున్నాం’’ అని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా చెప్పారు. ఇక నుంచి మరో 4 శాతం కొనుగోళ్లను ఎస్సీ/ఎస్టీ మహిళలకు చెందిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి చేయాలని నిబంధన పెడతామన్నారు. లేనిపక్షంలో ఆయా కంపెనీలో ఎస్సీ/ఎస్టీ మహిళలకు కనీసం 50 శాతం వాటా అయినా ఉండాలన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ఆధ్వర్యంలో సోమవారమిక్కడ 19వ ‘‘గ్లోబల్ స్టార్టప్ వర్క్షాప్’’ను మంత్రి ప్రారంభించారు. మూడురోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్లో తెలంగాణ ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్తో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిశ్రా ఏమన్నారంటే...
♦ ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించి, వ్యాపారావకాశాలు కల్పించేం దుకు ఉద్యోగ్ ఆధార్ (యూఏఎం) పాలసీని తీసుకొచ్చాం. దీని ప్రకారం దేశంలోని అన్ని ఎంఎస్ఎంఈలు తమ పేర్లను యూఏఎం వద్ద తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో ఎంఎస్ఎంఈలు వివిధ పథకాలకు అర్హత పొందుతాయి. ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ఎలాంటి సపోర్టింగ్ డాకుమెంట్స్, ఫీజు అవసరం లేదు. స్వీయ డిక్లరేషన్ను ఇస్తే చాలు.
♦ కొన్నేళ్లుగా ఎంఎస్ఎంఈ రంగం ఏటా 10 శాతం వృద్ధిని నమోదు చేస్తోంది. జీడీపీలో 37.5 శాతం వాటా ఈ రంగానిదే.
♦ ఎంఎస్ఎంఈల్లో తయారీ రంగం వాటా 45 శాతం, ఎగుమతుల వాటా 44 శాతం. ఈ రంగంపై 8 కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. వీరిలో 3.6 కోట్ల మంది పారిశ్రామికవేత్తలే.
♦ 2014 నుంచి ఇప్పటి వరకు 1,12,883 ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్లకు అనుమతులిచ్చాం. వీటి ద్వారా 8.71 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలొచ్చాయి.
♦ వ్యవసాయాధారిత ఎంఎస్ఎంఈ, స్టార్టప్లను ప్రోత్సహించేందుకు పథకం తెచ్చాం. సిడ్బీ సహకారంతో ఈ పథకం కింద టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (టీబీఐ), లైవ్లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్స్ (ఎల్బీఐ) ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తే ఆయా రాష్ట్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తాం. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ టీబీఐ, ఎల్బీఐ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం.


