
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు డిసెంబర్ 28తో ముగిసిన వారంలో 116.4 మిలియన్ డాలర్లు ఎగశాయి. దీనితో నిల్వలు మొత్తం విలువ 393.40 బిలియన్ డాలర్లకు చేరింది. విలువను డాలర్ రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ (యూరో, పౌండ్, యన్ వంటివి) అసెట్స్ పెరగడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్ 13న రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకనిల్వలు అటు తర్వాత క్రమంగా తగ్గాయి. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...
ఫారిన్ కరెన్సీ అసెట్స్: మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన ఈ విభాగం పరిమాణం 106.30 మిలియన్ డాలర్లు పెరిగి 368.077 బిలియన్ డాలర్లకు చేరింది.
►పసిడి నిల్వల విలువ స్థిరంగా 21.224 బిలియన్ డాలర్లుగా ఉంది.
►ఇక ఐఎంఎఫ్కు సంబంధించిన దేశీ నగదు నిల్వలు కూడా 6.5 మిలియన్ డాలర్లు పెరిగి 2.640 బిలియన్ డాలర్లకు ఎగసింది.