వాట్సాప్‌: ప్రభుత్వ సంచలన నిర్ణయం  | Indian government wants to build its own WhatsApp | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌: ప్రభుత్వ సంచలన నిర్ణయం 

Jun 29 2019 7:50 PM | Updated on Jun 29 2019 7:51 PM

Indian government wants to build its own WhatsApp - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే  బహుల ప్రజాదరణ పొందిన మేసేజింగ్‌ యాప్‌  వాట్సాప్‌.  అయితే వాట్సాప్‌కు సంబంధించి కొన్ని అంచనాలు   హాట్‌ టాపిక్‌గా మారాయి.  ఫేక్‌న్యూస్‌, భద్రతపై  అనేక   ఆందోళనల నేపథ్యంలో  కేంద్ర ప్రభుత్వం సరికొత్త  వ్యూహరచన చేస్తోందిట. ప్రభుత్వం తన అంతర్గత సమాచార మార్పిడికి సేఫ్ అండ్ సెక్యూర్‌గా వాట్సాప్‌తో సమానమైన సొంత కమ్యూనికేషన్ యాప్‌ను రూపొందించాలని యోచిస్తోంది. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.

చైనా అమెరికా మధ్య ముదురుతున్న ట్రేడ్‌వార్‌ సందర్భంలో సొంత చాటింగ్ ప్లాట్ ఫామ్ తీసుకురావాలనే ఆలోచన వెనుక కారణాలను అధికారులు వివరించారని ఎకనామిక్స్‌ టైమ్స్‌ నివేదించింది.  ముఖ్యంగా చైనా కంపెనీ హువావేకి అమెరికా ఆంక్షలను విధించడంతో, హావావే ఉత్పత్తులను బ్యాన్‌ చేయాలని ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకొస్తోందని  అధికారులు గుర్తు చేస్తున్నారు.  ఈ నేపత్యంలో భవిష్యత్‌లో  మన దేశంలో కూడా అమెరికా కంపెనీల నెట్‌వర్క్‌లపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అందుకే సొంత వాట్సాప్‌ను అభివృద్ధి చేయనున్నామని ప్రభుత్వ అధికారులు వివరించారు. ఈ సర్కారీ వాట్పాప్‌ ద్వారా పంపే సమాచారం, డేటా చోరీ అయ్యే అవకాశం ఉండదంటున్నారు. అంతేకాదు ఈ సమాచారాన్ని 100 శాతం భారత దేశంలోనే భద్రపరుస్తామని అధికారులు తెలిపారు. సర్కారీ వాట్సాప్‌ వచ్చాక అధికారిక సమాచారాన్ని, డేటాను పంపేందుకు జీ-మెయిల్, వాట్సాప్‌తదితర యాప్‌లను వాడొద్దని అధికారులకు, ప్రభుత్వ సిబ్బందికి సూచిస్తామన్నారు.  

ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ , టెలిగ్రామ్ వంటి యాప్‌లకు ప్రత్యామ్నాయంగా అంతర్గత ప్రభుత్వ సమాచార మార్పిడి కోసం ఫ్రాన్స్ దేశం టి చాప్‌ అనే యాప్‌ను లాంచ్‌ చేసింది. ఈ యాప్‌లో ముఖ్యమైన లక్షణాలలో ఒకటి, దాని డేటా మొత్తం  దేశంలోనే సురక్షితంగా ఉంచడం. అయితే బాప్టిస్ట్ రాబర్ట్ (ఇలియట్ ఆండర్సన్) అనే భద్రతా పరిశోధకుడు ఈ యాప్‌లో లోపాన్ని కనుగొన్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

మన దేశానికి చెందిన డేటాను మన దేశంలోనే భద్రపరచాలని(డేటా లోకలైజేషన్‌) కేంద్రం పట్టుదలగా ఉంది. ఈ మేరకు  డేటా లోకలైజేషన్‌ నిబంధనలపై రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టతనిచ్చింది. పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటింగ్‌ సంస్థలు (పీఎస్‌వో) చెల్లింపుల లావాదేవీల డేటా మొత్తం భారత్‌లోని సిస్టమ్స్‌లోనే భద్రపర్చాల్సి ఉంటుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement