మూడింతలైన ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు

IDBI Bank two quarter losses wipe off 65% of investment by LIC - Sakshi

ఈ క్యూ3లో రూ.4,185 కోట్ల నష్టాలు

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో మూడు రెట్లు పెరిగాయి. గత క్యూ3లో  రూ.1,524 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.4,185 కోట్లకు పెరిగాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. కేటాయింపులు అధికంగా ఉండడం, నికర వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటం, నిర్వహణ ఆదాయం కూడా తక్కువగా ఉండటంతో ఈ స్థాయిలో నికర నష్టాలు వచ్చాయని వెల్లడించింది. ఆదాయం రూ.7,125 కోట్ల నుంచి రూ.6,191 కోట్లకు తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం 19% క్షీణించి రూ.1,357 కోట్లకు తగ్గింది

మిశ్రమంగా రుణ నాణ్యత
బ్యాంక్‌ రుణ నాణ్యత మిశ్రమంగా నమోదైంది. గత క్యూ3లో 24.72 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 29.67 శాతానికి పెరిగాయి. నికర మొండి బకాయిలు మాత్రం 16.02 శాతం నుంచి 14.01 శాతానికి తగ్గాయి. మొండి బకాయిలకు కేటాయింపులు పెంచామని, గత క్యూ3లో రూ.3,650 కోట్లుగా ఉన్న ఈ కేటాయింపులు ఈ క్యూ3లో రూ.5,075 కోట్లకు పెరిగాయని పేర్కొంది. తాజా మొండి బకాయిలు మాత్రం ఏడు క్వార్టర్ల కనిష్ట స్థాయికి, రూ.2,211 కోట్లకు తగ్గాయని తెలిపింది. గత క్యూ3లో రూ.537 కోట్లుగా ఉన్న రికవరీలు ఈ క్యూ3లో రూ.3,440 కోట్లకు పెరిగాయి. కాగా, బీఎస్‌ఈలో ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ 4 శాతం నష్టపోయి రూ.50.65 వద్ద ముగిసింది.   

పేరు మార్పు ప్రతిపాదన  
ఐడీబీఐ బ్యాంక్‌ పేరును మార్చాలని ఐడీబీఐ డైరెక్టర్ల బోర్డ్‌ ప్రతిపాదించింది. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) ఈ బ్యాంక్‌ను టేకోవర్‌ చేసినందున (51% వాటా కొనుగోలు) బ్యాంక్‌ పేరును ఎల్‌ఐసీ ఐడీబీఐ బ్యాంక్‌గా గానీ, లేదా ఎల్‌ఐసీ బ్యాంక్‌గా గానీ మార్చాలని బోర్డ్‌ ప్రతిపాదించింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top