కరాచీ బేకరీ స్వీట్స్‌లో పురుగులు | Hyderabad’ iconic Karachi bakery Worms found in sweets Authorities raids | Sakshi
Sakshi News home page

కరాచీ బేకరీ స్వీట్స్‌లో పురుగులు

Nov 7 2018 9:50 AM | Updated on Nov 7 2018 1:14 PM

 Hyderabad’ iconic Karachi bakery  Worms found in sweets Authorities raids - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పండుగ రోజు  షాకింగ్‌ న్యూస్‌. దీపావళి అంటేనే స్వీట్స్‌కు  ప్రత్యేకం.  బిజీబిజీ గందరగోళ జీవితంలో పండుగలకు, పబ్బాలకు స్వీట్‌ షాప్‌లు, బేకరీలపైనే ఆధారపడటం నగరవాసులకు తప్పనిసరి.  అందులోనూ పేరున్న షాపులను ఎంచుకోవడం కూడా పరిపాటి. అయితే అలాంటి పెద్ద పేరున్న కంపెనీల్లోనే చెడిపోయిన, అనారోగ్యకరమైన పదార్థాలను  వినియోగదారులకు అంటగడితే.. వినియోగదారుల పరిస్థితి  బెంబేలే. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే హైదరాబాద్‌ కస్టమర్‌కు ఎదురైంది. అతి పెద్ద పేరున్న కరాచీ బేకరిలో. వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్  అమీర్‌పేట్‌లోని కరాచీ బేకరీనుంచి దీపక్‌ అనే వినియోగదారుడు చాకొలెట్‌ స్వీట్లు కొనుగోలు చేశారు. తీరా ఇంటికెళ్లి పరిశీలిస్తే...పురుగులు పలకరించాయి. దీంతో దీపక్‌ ఫ్రెండ్‌  దోనితా జోష్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. హ్యాపీ వార్మీ దివాలీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది.

దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించారు. జీహెచ్‌ఎంసీ వెస్ట్‌జోన్ కమీషనర్ హరిచందన ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. కలుషితమైన స్వీట్లు ఇచ్చినట్టుగా తేలిందనీ, నిబంధనలను ఉల్లంఘించినందుకు బేకరీ యజమానికి 25వేలరూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు.

కాగా హైదరాబాద్‌  65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐకానిక్‌ కరాచీ బేకరీ అంటే  హైదరాబాదీయులకు ఎనలేని నమ్మకం. కానీ  ఇదే ఆరోపణలతో, నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 2014లో, బంజారా హిల్స్  బేకరీ  ఔట్‌లెట్‌ను  అధికారులు మూసివేయడం గమనార్హం. అలాగే కేవలం రెండు నెలల క్రితం, హైదరాబాదులోని  ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఐకియా షోరూంలోని  రెస్టారెంట్ బిర్యానీలో  గొంగళి పురుగు కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement