ఏసీలు, ఫ్రిడ్జ్‌లు మరింత కాస్ట్‌లీ

Fridge, AC to cost more from next month

ముంబై : ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్‌ మెషిన్ల ధరలు మరింత కాస్ట్‌లీగా మారబోతున్నాయి. వచ్చే నెల నుంచి వీటి ధరలు 3-5 శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. పెరిగిన ఇన్‌పుట్‌ వ్యయాల మేరకు ధరలు పెంచాలని ఈ వైట్‌ గూడ్స్‌ తయారీదారులు ప్లాన్‌ చేస్తున్న నేపథ్యంలో వీటి ధరలు పెరుగబోతున్నట్టు ఇండస్ట్రి వర్గాలు చెబుతున్నాయి. గత ధరల పెంపు నుంచి ఇప్పటి వరకు ఇన్‌పుట్‌ వ్యయాలు 30-35 శాతం మేర పెరిగినట్టు తెలిసింది. స్టీల్‌ ధర 40 శాతం, కాపర్‌ ధర 50 శాతం పెరగడంతో పాటు రిఫ్రిజిరేట​ర్లలో ఎక్కువగా వినియోగించే కీలక కెమికల్‌ ఎండీఐ అంతర్జాతీయంగా లోపించింది. దీంతో ఇన్‌పుట్‌ వ్యయాలు రెండింతలు పైకి ఎగిశాయి. 

ఈ మూడు కలిపి ఇన్‌పుట్‌ వ్యయాల్లో 70 శాతం మేర నమోదవుతున్నాయి.. దీంతో వైట్‌ గూడ్స్‌ ధరలపై నికరంగా 5-6 శాతం ప్రభావం పడనుందని గోద్రెజ్‌ అప్లియెన్స్‌ బిజినెస్‌ హెడ్‌ కమల్‌ నంది చెప్పారు. దీనిలో కొంత కంపెనీలు భరించి, మిగిలిన మొత్తం వినియోగదారులపై విధించనున్నట్టు పేర్కొన్నారు. తొలుత రిఫ్రిజిరేటర్ల ధరలు పెంచుతామని వచ్చే నెల నుంచి ఈ పెంపు ఉంటుందని నంది తెలిపారు. తర్వాత వాషింగ్‌ మిషన్లు, అనంతరం జనవరి నుంచి ఏసీ ధరల సమీక్ష ఉంటుందన్నారు. వైట్‌ గూడ్స్‌లో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా, దాని ప్రత్యర్థి శాంసంగ్‌లు కూడా ఈ కేటగిరీ ఉత్పత్తులపై ధరల పెంపుకు సన్నాహాలు చేస్తున్నాయని దిగ్గజ రిటైల్‌ చైన్‌ చీఫ్‌ చెప్పారు. అయితే శాంసంగ్‌ ధరల పెంపును ఖండించగా.. ఎల్‌జీ ఇంకా స్పందించలేదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top