రూ.20 వేలకు చేరనున్న ఎంట్రీ లెవెల్ 5జీ ఫోన్ ధర
రూ. 40 వేలకు 3 స్టార్ 1.5 టన్ను ఏసీలు
ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి పతనం కారణం
ముడి వస్తువుల వ్యయాల పెరుగుదల, రూపాయి విలువ క్షీణిస్తుండటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల్లాంటి ప్రతికూల పరిస్థితులతో మొబైల్స్, టీవీల నుంచి ఎయిర్ కండీషనర్ల వరకు అన్నింటి రేట్లకు రెక్కలొస్తున్నాయి. గత నవంబర్–డిసెంబర్ నుంచి స్మార్ట్ఫోన్లు, టీవీల రేట్లు ప్రతి 30–60 రోజులకోసారి పెరుగుతూనే ఉన్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాధారణంగా ఉత్పత్తి పరిమాణం పెరిగే కొద్దీ, ముడి వస్తువుల వ్యయాలు తగ్గి కంపెనీలు చౌకగా ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తాయి.
ఒకవేళ కొన్నాళ్లు పరిస్థితి అటూ ఇటూ అయినా అమ్మకాలను పోగొట్టుకోవడానికి ఇష్టపడక, అదనపు భారమేదైనా పడితే తామే భరించి, రేట్లను పెంచకుండా జాగ్రత్త పడుతుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతో భారాన్ని వినియోగదారులకి బదలాయిస్తున్నాయి. దీనితో ఎంట్రీ లెవెల్ టీవీలు, స్మార్ట్ఫోన్ల ధరలు తిరిగి 6–8 ఏళ్ల క్రితం నాటి స్థాయికి చేరుకుంటున్నాయి.
వేసవి వడగాలి..: ఏసీల్లో పెద్ద ఎత్తున అమ్ముడయ్యే కేటగిరీ ఉత్పత్తులు, ఫ్రిజ్లు,, వాషింగ్ మెషిన్ల ధరలు కూడా ఈ నెల నుంచి భారీగా పెరుగుతున్నాయి. తొలిసారిగా కొనుక్కునే వారు ఎక్కువగా మొగ్గు చూపే 3 స్టార్ 1.5 టన్ను ఏసీల రేట్లు గతేడాది వేసవిలో సుమారు రూ. 32,000–34,000గా ఉండగా ఈ ఏప్రిల్లో రూ. 37,000–40,000కు పెరగనున్నాయి. కమోడిటీల ధరలు పెరగడం, కొత్త ప్రమాణాల అమలు కారణంగా ఏసీల రేట్లు 12 శాతం వరకు పెరగనున్నట్లు బ్లూస్టార్ గ్రూప్ ప్రెసిడెంట్ మోహిత్ సూద్ ఇటీవలే వెల్లడించారు. ఏప్రిల్ నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు వివరించారు.
మరోవైపు, ఎంట్రీ లెవెల్ 5జీ స్మార్ట్ఫోన్ల రేట్లు దీపావళి సమయంలో రూ. 10,000 లోపు ఉండగా, ప్రస్తుతం 13,000–14,000కి చేరాయి. కొన్ని బ్రాండ్స్ అయితే రాబోయే 2–3 నెలల్లో ఈ ఫోన్ల రేట్లు రూ. 20,000కి కూడా చేరొచ్చని చెబుతున్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ రేటు గతేడాది రూ. 6,500 స్థాయిలో ఉంటే, ఇప్పుడు రూ. 8,500గా ఉందని, మే నాటికి రూ. 10,000కు చేరొచ్చనేది పరిశ్రమ వర్గాలు మాట. వివో, ఒప్పో, శాంసంగ్, షావోమీలాంటి బ్రాండ్లు కొన్ని స్మార్ట్ఫోన్ల రేట్లను 10 శాతం వరకు పెంచనున్నట్లు సంకేతాలిచి్చనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మెమొరీ చిప్ల రేట్లు గత 5–6 నెలలుగా పెరగడం, గల్ఫ్ యుద్ధంతో పాటు రూపాయి బలహీనపడటమనేది కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని వివరించాయి.
సెకండ్ హ్యాండ్ ఫోన్స్ వైపు చూపు..
సాధారణంగా త్రైమాసికాలవారీగా రేట్లను తగ్గించడం, డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్లు ప్రకటించడం ద్వారా కస్టమర్లను ఆకర్షించేందుకు, తమ ఉత్పత్తులకు డిమాండ్ పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నిస్తుంటాయి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకపోగా రేట్లు మరో పది శాతం వరకు పెరగనున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దీనితో డిమాండ్పైనా ప్రభావం పడుతోంది. కొత్త ఫోన్లకు బదులు సెకండ్ హ్యాండ్, రీఫర్బి‹Ù్డ ఫోన్ల వైపు కొందరు కొనుగోలుదారులు మొగ్గు చూపుతుండగా, మరికొందరు పూర్తిగా కొనుగోలు నిర్ణయాన్నే వాయిదా వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 20,000 వరకు ఖరీదు చేసే ఫోన్లపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలంటూ ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేసేందుకు మొబైల్ రిటైలర్ల సంఘం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఇది 18 శాతంగా ఉంది.


