పెట్రో ధరల ఎఫెక్ట్‌.. బస్సు ఛార్జీలు పెంపు | Bus Ticket Charges Hiked In Odisha | Sakshi
Sakshi News home page

పెట్రో ధరల ఎఫెక్ట్‌.. బస్సు ఛార్జీలు పెంపు

May 17 2026 7:51 AM | Updated on May 17 2026 7:57 AM

Bus Ticket Charges Hiked In Odisha

భువనేశ్వర్‌: దేశంలో ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల బస్సు ఛార్జీలను పెంచింది. ఆటోమేటిక్‌ ఫేర్‌ అడ్జస్ట్‌మెంట్‌ మెకానిజం కింద బస్సు ఛార్జీలను పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త చార్జీలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. 

రాష్ట్ర రవాణా అథారిటీ (ఎస్‌టీఏ) కమిషనర్‌ కమ్‌ చైర్మన్‌ కార్యాలయం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2024 మార్చి 16 నాటికి లీటర్‌కు రూ.92.62గా ఉన్న డీజిల్‌ ధర, ఈ ఏడాది మే 15 నాటికి రూ.95.87కు పెరిగింది. ప్రత్యక్షంగా రూ.3.25.. సంచితంగా (క్యారీ ఓవర్‌తో కలిపి) రూ.4.80 మేర ధర పెరిగినందున రాష్ట్రంలో తిరిగే టౌన్‌ బస్సులు మినహా ఇతర స్టేజ్‌ క్యారేజీల ఛార్జీల పెంపు నిర్ణయించి తక్షణమే అమలు చేశారు. 

ఎస్‌టీఏ నిర్ణయం ప్రకారం సాధారణ, ఎక్స్‌ప్రెస్‌ వర్గం బస్సు చార్జీలు కిలో మీటరుకు 2 పైసలు చొప్పున పెంచారు. ఈ నేపథ్యంలో సాధారణ బస్సులో ప్రయాణం ఛార్జీ కిలో మీటరుకు 88 పైసలు నుంచి 90 పైసలకు పెరిగింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఛార్జీని ప్రస్తుతం కొనసాగుతున్న 92 పైసలు నుంచి 94 పైసలకు పెరిగింది. డీలక్స్‌ మరియు ఎయిర్‌ కండిషన్‌ డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణం ఛార్జీని కిలో మీటరుకు 4 పైసలు వంతున పెంచారు. సూపర్‌ డీలక్స్‌ బస్సు ప్రయాణం కిలో మీటరుకు 6 పైసలు పెంచారు.

Advertisement
 
Advertisement
Advertisement