మాది దీర్ఘకాలిక ఒప్పందం.. దీటుగా నిలబడతాం!

Flipkart CEORefutes Morgan Stanley Report - Sakshi

మోర్గాన్‌ స్టాన్లీ రిపోర్టును తీవ్రంగా తిరస్కరించిన ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో  

ఈ కామర్స్‌లో దీటుగా నిలబడతాం- కల్యాణ్‌ కృష్ణమూర్తి

 ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్‌ సమాచారం

సాక్షి, ముంబై : వాల్‌మార్ట్‌ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వైదొలగుతుందా? అంటూ మార్కెట్లో వర్గాల్లో తీవ్ర సందేహాలు నెలకొన్నాయి. అయితే ఈ వార్తలను  ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో కల్యాణ్‌ కృష్ణమూర్తి తీవ్రంగా ఖండించారు. ప్రతికూల ప్రభావం కారణంగా  ఫ్లిప్‌కార్ట్‌లో వాల్‌మార్ట్‌ భారతీయ మార్కెట్లలో పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చన్న మోర్గాన్ స్టాన్లీ నివేదికను ఆయన  తిరస్కరించారు.

ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో ఉద్యోగులకు అంతర్గత ఈ మెయిల్‌ సమాచారాన్ని అందించారు. మోర్గాన్‌ స్టాన్లీ రిపోర్టు అవాస్తమని భవిష్యత్తులో తేలిపోతుందని, భారతదేశంలో ఈ కామర్స్‌ వ్యాపారానికి వాల్‌మార్ట్‌ కట్టుబడి వుందని స్పష్టం చేశారు. భారతీయ ఈ కామర్స్‌ బిజినెస్‌లో ఫ్లిప్‌కార్ట్‌ ముందు వరుసలో నిలుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వాల్‌మార్ట్‌ ఒప్పందం దీర్గకాలిక దృష్టితో చేసుకున్నదని, ఈ నేపథ్యంలో స్వల్పకాలిక అడ్డంకులు సంస్థను ప్రభావితం చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు. 

ఈ కామర్స్‌ మార్కెట్‌లో అతిపెద్ద డీల్‌ గా నిలిచిన వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్డ్‌ ఒప్పందానికి సంబంధించిన మోర్గాన్‌ స్టాన్లీ సంచలన అంచనాలను వెల్లడించింది. దేశీయంగా ఈ-కామర్స్ కంపెనీలకు సంబంధించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నూతన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి  తీసుకొచ్చిన నేపథ్యంలో వాల్‌మార్ట్‌  ఈ డీల్‌ నుంచి వైదొలగనుంచి  పేర్కొంది.  2017లో చైనాలో అమెజాన్‌కు దాపురించిన పరిస్థితే దేశీయంగా వాల్‌మార్ట్‌కు రానుందని నివేదించింది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్‌ నష్టాలు 20నుంచి 25శాతం దాకా  పెరగొచ్చనీ, దీంతో వాల్‌మార్ట్‌ పలాయనం చిత్తగించక తప్పదని వ్యాఖ్యానించింది. కాగా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్.. 16 బిలియన్ డాలర్లతో  77శాతం వాటాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top