అంతర్జాతీయ విమాన సంస్థలు ఒక్కొక్కటిగా భారత్కు సూపర్ జంబో ఏ-380 విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సంస్థలు ఒక్కొక్కటిగా భారత్కు సూపర్ జంబో ఏ-380 విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా ఎమిరేట్స్ సంస్థ .. జూలైలో దుబాయ్-ముంబై రూట్లో ఏ-380 విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. జూన్ 1 నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబై నగరాలకు భారీ బోయింగ్-777 విమానాలను నడపాలని యోచిస్తున్నట్లు ఎమిరేట్స్ అధికారి తెలిపారు.
ఈ నెల 30 నుంచి ఢిల్లీ, ముంబై నగరాల నుంచి ఏ-380 విమానాలను నడపనున్నట్లు సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రకటించిన నేపథ్యంలో ఎమిరేట్స్ తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. డబుల్ డెక్కర్ తరహాలో ఉండే సింగపూర్ ఎయిర్లైన్స్ ఏ-380 విమానంలో ఒకే సారి వివిధ తరగతుల్లో 471 మంది ప్రయాణించవచ్చు. వీటి వల్ల దేశీయ విమాన సంస్థల వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో ఏ-380 విమానాలను అయిదేళ్ల క్రితం భారత్ నిషేధించింది. అయితే, అంతర్జాతీయ విమానయాన సంస్థల ఒత్తిడితో జనవరిలో నిషేధాన్ని ఎత్తివేసింది.