కరీంనగర్లో ‘ఇక్లాట్’ డెలివరీ సెంటర్ | Eclat Health Solutions delivery center in kareem nagar | Sakshi
Sakshi News home page

కరీంనగర్లో ‘ఇక్లాట్’ డెలివరీ సెంటర్

Aug 17 2016 12:15 AM | Updated on Sep 4 2017 9:31 AM

కరీంనగర్లో ‘ఇక్లాట్’ డెలివరీ సెంటర్

కరీంనగర్లో ‘ఇక్లాట్’ డెలివరీ సెంటర్

మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ‘ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్’ కరీంనగర్‌లో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.

1,000 మందికి ఉద్యోగాలు
రూ.100 కోట్లకుపైగా పెట్టుబడి
ఇక్లాట్ సీఈవో కార్తీక్ పొల్సాని

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మెడికల్ కోడింగ్ సేవల్లో ఉన్న యూఎస్‌కు చెందిన ‘ఇక్లాట్ హెల్త్ సొల్యూషన్స్’ కరీంనగర్‌లో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.100 కోట్లకుపైగా వెచ్చిస్తోంది. ప్రస్తుతం 200 మంది పనిచేస్తున్న ఈ కేంద్రం ద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా 1,000 మందికి ఉద్యోగాలు రానున్నట్లు కంపెనీ తెలియజేసింది. నిజానికి తెలంగాణలో హైదరాబాద్ వెలుపల ఓ బహుళజాతి సంస్థ ఈ స్థాయిలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి.

డెలివరీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ఈ ఏడాది మే నెలలో తెలంగాణ ప్రభుత్వానికి, కంపెనీకి అమెరికాలో కేటీఆర్ పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారంనాడు కొత్త సెంటర్‌ను ప్రారంభిస్తారని ఇక్లాట్ సీఈవో కార్తీక్ పొల్సాని మంగళవారమిక్కడ తెలిపారు. ఇక్లాట్ చైర్మన్ సుధాకర్‌రావు పొల్సాని, సీవోవో స్నేహ పొల్సానితో కలిసి మీడియాతో మాట్లాడారు.

అయిదేళ్లలో 5,000 మంది...
ఇక్లాట్‌కు యూఎస్‌లో మూడు కార్యాలయాలు, భారత్‌లో హైదరాబాద్, చెన్నైలో డెలివరీ సెంటర్లున్నాయి. హైదరాబాద్‌లో 250 మంది, చెన్నైలో 100, యూఎస్‌లో 40 మంది పనిచేస్తున్నారు. అయిదేళ్లలో ఉద్యోగుల సంఖ్యను 5,000లకు చేరుస్తామని కార్తీక్ వెల్లడించారు. లైఫ్ సెన్సైస్ చదివినవారికి తొలి ప్రాధాన్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు చెప్పారు. ‘సమర్థులు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్, కరీంనగర్‌లో పనిచేస్తున్నవారిలో 70 శాతం మంది తెలుగు మీడియంలో చదివినవారే. అట్రిషన్ రేటు తక్కువ కాబట్టే కరీంనగర్‌ను ఎంచుకున్నాం. కంపెనీకి అయ్యే ఖర్చు కూడా తక్కువ’ అని చెప్పారు.

 2017లో వరంగల్‌లో..
వరంగల్‌లో మరో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఏడాదికల్లా దీన్ని అందుబాటులోకి తెస్తామని కార్తీక్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి వెల్లడించారు. ‘‘ముందుగా 100-150 మందితో ప్రారంభిస్తాం. దశలవారీగా ఉద్యోగుల సంఖ్యను 1,000కి పెంచుతాం. ఈ కేంద్రానికి కూడా రూ.100 కోట్ల దాకా పెట్టుబడి అవసరం అవుతుంది’’ అని వివరించారు. మెడికల్ రికార్డులను కోడ్స్ రూపంలోకి మార్చడమే కంపెనీ పని. ఈ కోడ్స్ ఆధారంగా బీమా కంపెనీలు క్లెయిమ్‌లను సెటిల్ చేస్తాయి. అమెరికాలో టాప్-20 ఆసుపత్రుల్లో అయిదు సంస్థలు తమ క్లయింట్లుగా ఉన్నట్లు స్నేహ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement