Sakshi News home page

ఇ-కామర్స్‌ కంపెనీలకు మరో షాక్

Published Sat, Apr 25 2020 2:24 PM

E Commerce Firms cant Sell Non Essentials : Centre  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కోవిడ్-19, లాక్‌డౌన్ సమయంలో ఇ-కామర్స్ సంస్థలకు షాకిచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు అత్యవరసమైన సరుకులు తప్ప, మిగిలిన సరుకు పంపిణీ కుదరదని తేల్చి చెప్పింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా నాన్ ఎసెన్షియల్ వస్తువుల విక్రయంపై నిషేధం దేశవ్యాప్తంగా  కొనసాగుతుందని హోం మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే నివాస ప్రాంతాల్లోని, మార్కెట్ కాంప్లెక్స్‌లలోని అన్ని దుకాణాలను తిరిగి తెరుచుకునేందుకు శనివారంనుంచి అవకాశం కల్పించింది. ఇ-కామర్స్ సంబంధించి అవసరమైన వస్తువుల విక్రయాలకు మాత్రమే అనుమతి వుంటుందని మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది. అయితే ప్రభుత్వం ఆయా వెబ్‌సైట్ల గురించి ప్రస్తావించనప్పటికీ, ప్రధానంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు దెబ్బే. (జియోకు పోటీగా దూసుకొస్తున్న అమెజాన్)

లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో నివాస సముదాయాలు, పరిసరాల్లోని దుకాణాలతో సహా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవాలని కేంద్రం తెలిపింది. అయితే ఈ సడలింపులు, కరోనావైరస్ హాట్‌స్పాట్‌లు లేదా కంటైన్మెంట్ జోన్‌లకు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కిరాణా దుకాణాలు, కూరగాయలు, మందులు లాంటి నిత్యావసర దుకాణాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజా సడలింపులతో స్టేషనరీ, బ్యూటీ సెలూన్స్‌, డ్రైక్లీనర్స్‌, ఎలక్టికల్‌  దుకాణాలకు తెరుచుకునేందుకు అవకావం వుంది. అయితే ఇవన్నీ ఆయా రాష్ట్రా ప్రభుత్వాల అనుమతితో మాత్రమే జరగాలని కేంద్ర స్పష్టం చేసింది.  (కరోనా : టాప్-10 నుంచి స్టాక్‌ మార్కెట్ ఔట్)

లాక్‌డౌన్ కారణంగా పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం క్రమంగా ఆంక్షలను సడలిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గత వారం మొబైల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు, బట్టలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులను ఆన్‌లైన్‌లో విక్రయించడానికి అనుమతి ఇచ్చిన కేంద్రం మరికొన్నింటిపై ఆంక్షలు కొనసాగించడం గందరగోళానికి దారితీసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరుతో కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌(సీఏఐటీ) సెక్రటరీ జనరల్‌ ప్రవీణ్‌   ఖందేల్వాల్‌  లేఖ రాశారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయాన్ని ప్రవీణ్‌ స్వాగతించారు కూడా. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్‌ల కోసం కొత్త ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించడం గమనార్హం. కాగా దేశంలో లాక్‌డౌన్.2 మే 3వ తేదీవరకు  కొనసాగుతున్న సంగతి తెలిసిందే.  (ప్రపంచంలోనే టాప్ సుందర్ పిచాయ్)

 చదవండి : కరోనా: ప్రమాదంలో 29 లక్షలకు పైగా ఉద్యోగాలు
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌‌కు షాకివ్వనున్న జియో మార్ట్
కరోనా వైరస్ : గ్లెన్‌మార్క్‌ ఔషధం!
5 సెకన్లలో కరోనా వైర‌స్‌ను గుర్తించవచ్చు!

Advertisement

What’s your opinion

Advertisement