ఇల్లు కొంటే షేర్లు ఫ్రీ! | Dosti-Suraksha JV to acquire Jaypee Infra for Rs 7350 crore | Sakshi
Sakshi News home page

ఇల్లు కొంటే షేర్లు ఫ్రీ!

May 11 2018 1:02 AM | Updated on May 11 2018 1:02 AM

Dosti-Suraksha JV to acquire Jaypee Infra for Rs 7350 crore - Sakshi

న్యూఢిల్లీ: తమ వద్ద ఇల్లు కొనుగోలు చేసినవారికి జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు చెందిన 2000 షేర్లను ఉచితంగా ఇస్తామని జేపీ గ్రూప్‌ ప్రకటించింది. అనేక కారణాలతో చితికిపోయి దివాలా తీసిన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను పునరుజ్జీవింపజేసేందుకు జేపీ గ్రూప్‌ పదివేల కోట్ల రూపాయల ప్రణాళికను ప్రకటించింది. ఈ ప్రణాళికలో భాగంగా షేర్లు ఇచ్చే ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. జేపీ అసోసియేట్స్‌కు అనుబంధ సంస్థైన జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ 2007లో నోయిడాలో 32వేల ఫ్లాట్స్‌ అభివృద్ధి చేయడం ఆరంభించింది. ఇందులో 9,500 ఫ్లాట్స్‌ను డెలివరీ చేసింది. మరో 4,500 ఫ్లాట్లకు సంబంధించి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లను అందించేందుకు దరఖాస్తు చేసుకుంది. 2021 నాటికి మిగిలిన ఫ్లాట్స్‌ డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ రుణభారం పెరగడంతో పనులు పూర్తికాలేదు. దీంతో డెలివరీ సమయానికి జరగని వారంతా కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంకు జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ నుంచి తమ రుణాలు రాబట్టుకునే యత్నాలు ఆరంభించడంతో ఇళ్లు కొన్నవారిలో ఆందోళన పెరిగింది.

ఈ నేపథ్యంలో ఇళ్లు కొన్నవారికి అన్యాయం జరగకుండా ఉండేందుకు షేర్లు ఇచ్చే ప్రతిపాదనను జేపీ గ్రూప్‌ తెచ్చింది. ఇందుకోసం 4.5 కోట్ల షేర్లు అవసరపడతాయని అంచనా. కేవలం షేర్లు ఇవ్వడమే కాకుండా ఇళ్ల కొనుగోలుదారులకు రెరా ప్రకారం జరిమానా కూడా చెల్లిస్తామని, ఫస్ట్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో 50 శాతం స్టాంప్‌ డ్యూటీ భరిస్తామని జేపీ గ్రూప్‌ పేర్కొంది. జరిమానా చెల్లించేందుకు హామీగా జేపీ అసోసియేట్స్‌ రూ. 750 కోట్లను సుప్రీంకోర్టు వద్ద డిపాజిట్‌ చేసింది. మరోవైపు జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ కొనుగోలుకు సంబంధించి లక్షద్వీప్‌ గ్రూప్‌ ఆఫర్‌ చేసిన రూ. 7,350 కోట్ల బిడ్‌ను రుణదాతలు తిరస్కరించారు. బుధవారం జరిగిన సీఓసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మొత్తం తమకు సరిపోదని రుణదాతలు బిడ్‌ను తిరస్కరించారు. కంపెనీ కొనుగోలుకు వచ్చిన బిడ్లలో లక్షద్వీప్‌ బిడ్‌ ముందంజలో ఉన్నది. కానీ రుణదాతలు ససేమిరా అనడంతో అమ్మకం ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చే సూచనలు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement