పనితీరు నచ్చకపోవడమే కారణమా...! | Cyrus Mistry Out As Tata Sons Chairman, Ratan Tata Named Interim Chief | Sakshi
Sakshi News home page

పనితీరు నచ్చకపోవడమే కారణమా...!

Oct 25 2016 1:34 AM | Updated on Sep 4 2017 6:11 PM

పనితీరు నచ్చకపోవడమే కారణమా...!

పనితీరు నచ్చకపోవడమే కారణమా...!

గ్రూపులోని వ్యాపారాలపై ఇప్పటికీ మిస్త్రీ పెద్దగా పట్టు సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి.

గ్రూపులోని వ్యాపారాలపై ఇప్పటికీ మిస్త్రీ పెద్దగా పట్టు సాధించలేకపోయారన్న విమర్శలున్నాయి. పెపైచ్చు ప్రధానంగా లాభాల్లో ఉన్న కంపెనీలపైనే (టీసీఎస్ ఇతరత్రా) అధికంగా దృష్టిపెట్టారని, నష్టజాతక కంపెనీలను సరిగ్గా పట్టించుకోవడం లేదని కూడా విమర్శలొస్తున్నాయి. వీటన్నిటికీ తోడు... టాటా గ్రూప్ ఇప్పటిదాకా ఉద్యోగాల్లో కోత పెట్టిన సందర్భాలు లేవని, మిస్త్రీ మాత్రం నష్టాలొస్తున్న కంపెనీల్లో ఉద్యోగుల్ని తొలగించడానికి ఏమాత్రం వెనకాడటం లేదని, ఇది టాటా గ్రూప్ విధానానికి వ్యతిరేకం కనక టాటా సన్స్‌కు ఇది నచ్చటం లేదన్న కథనాలూ వినవస్తున్నాయి. నష్టాల్లో ఉన్న కొన్ని కంపెనీల తీరును చూస్తే...

టాటా స్టీల్ యూకే... బ్రెగ్జిట్ ఎఫెక్ట్
యూరప్‌లో తీవ్ర నష్టాల్లో ఉన్న స్టీల్ వ్యాపారం (గతంలో కోరస్ స్టీల్.. ఇప్పుడు టాటా స్టీల్ యూకే) సహా, ఇతర నష్టాల్లో ఉన్న కంపెనీలను వదిలించుకునే విషయంలో మిస్త్రీ ధోరణి బోర్డు సభ్యులకు నచ్చలేదని భావిస్తున్నారు. ముఖ్యంగా టాటా స్టీల్ యూకే ఆస్తులను రైటాఫ్ చేయడం, ఆ తర్వాత వాటిని విక్రయించడంపై టాటా ట్రస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 2016 తొలి త్రైమాసికంలో టాటా స్టీల్ రూ.3,000 కోట్ల భారీ నష్టాలను చవిచూడటానికి యూరప్ కార్యకలాపాలే కారణం. ఇక యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగడం(బ్రెగ్జిట్) కూడా టాటా స్టీల్ యూకేతో పాటు మొత్తం గ్రూప్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

డొకోమో కేసు....
టాటా డొకోమో జాయింట్ వెంచర్ తెగదెంపులకు సంబంధించి జపాన్ భాగస్వామ్య సంస్థ డొకోమోతో కోర్టుల్లో న్యాయపోరాటం కూడా టాటా గ్రూప్‌పై తీవ్ర ప్రభావాన్నే చూపింది. దీన్ని ఎదుర్కోవడంలో కూడా మిస్త్రీ సమర్థంగా వ్యవహరించలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తెగదెంపుల్లో తమకు 1.2 బిలియన్ డాలర్ల పరిహారాన్ని టాటా సన్స్ చెల్లించాలంటూ బ్రిటన్‌లో ఆర్బిట్రేషన్‌కు కూడా డొకోమో తెరతీసింది. ఈ మొత్తాన్ని చెల్లించకుంటే టాటాల ఆస్తులను అటాచ్ చేయాలని కూడా కోరుతోంది.

చతికిలపడిన కొత్త కార్లు...
టాటా మోటార్స్ ప్రతియేటా రెండు కొత్త కార్లను తీసుకొస్తుందంటూ మిస్త్రీ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు.  విడుదల చేసిన టియాగో(జికా పేరును మార్చారు) బోల్ట్‌లు కూడా దేశీ మార్కెట్లో నిరాశపరిచాయి. మరోపక్క, బ్రెగ్జిట్ కారణంగా జేఎల్‌ఆర్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీన్ని ఎదుర్కొనే ప్రణాళికలను మిస్త్రీ సరిగ్గా రూపొందించలేదనే వాదనలు ఉన్నాయి.

టర్నోవర్ పెద్దగా పెరగలేదు...
మిస్త్రీ బాధ్యతలు చేపట్టేనాటికి టాటా గ్రూప్ టర్నోవర్ 100.99 బిలియన్ డాలర్లు (20-11-12లో) కాగా.. 2015-16లో 103 బిలియన్ డాలర్లకు చేరింది.  వ్యాపారాల్లో వృద్ధి అంతంతమాత్రంగా ఉండటానికి నాయకత్వలోపమే కారణమని గ్రూప్ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement