రికార్డుల హోరు | Bulls lift market to new closing high: Nifty above 9500, Sensex gains | Sakshi
Sakshi News home page

రికార్డుల హోరు

May 17 2017 1:41 AM | Updated on Oct 2 2018 8:16 PM

రికార్డుల హోరు - Sakshi

రికార్డుల హోరు

మంగళవారం స్టాక్‌ మార్కెట్లో రికార్డులు హోరెత్తిపోయాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ రికార్డు గరిష్టస్థాయికి పెరగడంతో పాటు అదేస్థాయి వద్ద ముగియడం విశేషం.

సెన్సెక్స్‌ 30,500 పైన, నిఫ్టీ 9,500 పైన
రుతు పవనాలు, ప్రోత్సాహకర ఫలితాల జోష్‌
ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్, ఆటో రంగాల జోరు


ముంబై: మంగళవారం స్టాక్‌ మార్కెట్లో రికార్డులు హోరెత్తిపోయాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ రికార్డు గరిష్టస్థాయికి పెరగడంతో పాటు అదేస్థాయి వద్ద ముగియడం విశేషం. చరిత్రలో తొలిసారిగా 30,500 పాయింట్ల స్థాయిని అధిగమించిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే 260 పాయింట్లు ఎగిసి 30,582 పాయింట్ల వద్ద ముగిసింది. అదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9,500 పాయింట్ల శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించి 9,512 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ 67 పాయింట్లు ర్యాలీ జరిపింది. మే 11న ఈ రెండు సూచీలు సాధించిన రికార్డు స్థాయిల్ని తాజాగా అధిగమించాయి.

ఈశాన్య రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ ద్వీపాల్ని సాధారణతేదీకంటే మూడు రోజులు ముందుగానే తాకాయన్న వార్తలతో కొనుగోళ్ల జోరు మొదలయ్యింది. మరోవైపు టీసీఎస్‌ బైబ్యాక్‌ ఆఫర్‌ ఈ నెల 18న మొదలవుతుందని ప్రకటించడం, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ వెల్లడించిన ఫలితాల్ని మార్కెట్‌ మెచ్చడం వంటి అంశాలు రోజంతా ఇన్వెస్టర్లను కొనుగోళ్లకు పురిగొల్పాయి. అలాగే గత రాత్రి అమెరికా సూచీలు కూడా కొత్త రికార్డుస్థాయిలో ముగియడం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చింది. భారత ఆర్థిక వ్యవస్థ ఉత్పాదక వృద్ధి దశలోకి ప్రవేశించిందని మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక కూడా మార్కెట్‌కు ఊతం ఇచ్చింది.

మెటల్స్‌ మినహా...
క్రితం రోజు ర్యాలీ జరిపిన మెటల్‌ షేర్లు మినహా దాదాపు అన్ని రంగాలకు చెందిన షేర్లూ ర్యాలీలో పాలుపంచుకున్నాయి. రుతువపనాలు వచ్చేశాయన్న వార్తలతో ఎఫ్‌ఎంసీజీ షేర్లు హిందుస్తాన్‌ యూనీలీవర్, ఐటీసీ షేర్లు 2 శాతంపైగా ఎగిసాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ మార్చితో ముగిసిన త్రైమాసికానికి నికరలాభాన్ని ప్రకటించడంతో ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకింగ్‌ షేర్లు పెరిగాయి. రెండు రోజుల్లో బైబ్యాక్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీసీఎస్‌ షేరు 2 శాతం ఎగిసింది. పెరిగిన షేర్లలో హీరో మోటో, మారుతి, విప్రో, భారతి ఎయిర్‌టెల్‌లు వున్నాయి.

ఒడిదుడుకుల భయాలూ ఉన్నాయ్‌..!
కాగా భవిష్యత్తు పనితీరుపట్ల ఆపోహలున్న ఐటీ, ఫార్మా, టెలికం రంగాలు కూడా తాజా ర్యాలీలో పాలుపంచుకోవడం ఆందోళన కల్గిస్తున్నదని, దీంతో వచ్చే కొద్ది రోజుల్లో మార్కెట్‌ ఒడిదుడుకులకు లోనుకావొచ్చని ఆయన అంచనావేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement