
సాక్షి, చెన్నై: బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల పాటు(48 గంటల) సమ్మె చేపట్టనున్నామని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) నాయకులు చెప్పారు. ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మె చేపట్టనున్నారు. మే 30వ తేదీ ఉదయం 6గంటల నుంచి జూన్ 1వ తేదీ ఉదయం 6గంటల వరకు సమ్మె నిర్వహించేందుకు నిర్ణయించినట్టు చెప్పారు. వేతనాల సమీక్ష విషయంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్లు(యూఎఫ్బీయూ)కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కి మధ్య మే 5 న ముంబైలో జరిగిన చర్చలు మరోసారి విఫలమవడంతో సమ్మెకు దిగుతున్నట్టు వెల్లడించారు.
బ్యాంక్ మేనేజ్మెంట్ అండ్ చీఫ్ లేబర్ కమీషనర్ (సెంట్రల్), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కు సమ్మె నోటీసులిచ్చామని ఏఐబీఈఏ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం స్పష్టం చేశారు. . 2017, నవంబరు నుంచి వేతన సవరణ పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. 2012 నవంబర్ 1న 10వ బిపర్టైట్ వేతన ఒప్పందంలో భాగంగా మొత్తం వేతన బిల్లులో 15 శాతానికి పైగా పెంపునకు బదులుగా 2శాతం ఐబీఏ ఆఫర్ చేయడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.