బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్‌లు వస్తున్నాయ్.. | Bajaj Auto to roll out higher cc bikes next year | Sakshi
Sakshi News home page

బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్‌లు వస్తున్నాయ్..

Apr 29 2015 2:33 AM | Updated on Sep 3 2017 1:02 AM

బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్‌లు వస్తున్నాయ్..

బజాజ్ 400 సీసీ పల్సర్ బైక్‌లు వస్తున్నాయ్..

ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో..

2016లో భారతీయ మార్కెట్లోకి
బజాజ్ ఆటో వైస్ ప్రెసిడెంట్ సుమీత్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో.. అధిక ఇంజిన్ సామర్థ్యమున్న బైక్‌లను రూపొందిస్తోంది. ఇప్పటి వరకు 220 సీసీ వరకు ఇంజిన్ గల బైక్‌లను విక్రయిస్తున్న ఈ సంస్థ 400 సీసీ మోడళ్లను సైతం అభివృద్ధి చేస్తోంది. 2016లో పల్సర్ 400 సీసీ మోడళ్లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేస్తామని బజాజ్ ఆటో మోటార్‌సైకిల్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ తెలిపారు.

పల్సర్ కొత్త బైక్‌లు ఏఎస్200, ఏఎస్150, ఆర్‌ఎస్200 మోడళ్లను మంగళవారమిక్కడ ప్రవేశపెట్టిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కస్టమర్ల డిమాండ్‌నుబట్టి 500 సీసీ వరకు ఆఫర్ చేయాలన్నది ఆలోచన అని చెప్పారు. పల్సర్ విభాగంలో ప్రస్తుతం 8 మోడళ్లను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. మార్చి 2016కల్లా మరో మూడు మోడళ్లు రానున్నాయని సమాచారం.
 
స్పోర్ట్స్ విభాగం 18 శాతం..
దేశంలో అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో స్పోర్ట్స్ విభాగం వాటా కొన్నేళ్ల క్రితం 10 శాతం మాత్రమే. ఇప్పుడీ విభాగం 2014-15లో 15 శాతం వృద్ధితో 17-18 శాతానికి ఎగసింది. నెలకు సుమారు 1.35 లక్షల వాహనాలు విక్రయమవుతున్నాయి. ఇందులో బజాజ్ పల్సర్‌కు 43 శాతం వాటా ఉంది. అంతేగాక బజాజ్ విక్రయిస్తున్న ద్విచక్ర వాహనాల్లో 40 శాతం పల్సర్ బ్రాండ్ కైవసం చేసుకుంది. అందుకే ఈ విభాగంపై ప్రత్యేక ఫోకస్ చేశామని సుమీత్ వెల్లడించారు.

ఏఎస్200, ఏఎస్150, ఆర్‌ఎస్200 చేరికతో మార్కెట్ వాటా ఈ ఏడాది 50 శాతానికి చేరువకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డిస్కవర్ బ్రాండ్‌లో ఇటీవల 150 సీసీ బైక్‌ను విడుదల చేశామని గుర్తు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement