విమానాల రద్దు సెగ: చార్జీల మోత

Airfares surge up to 10percent after faulty planes grounded   - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విమానయాన సం‌స్థల నిర్ణయంతో విమాన టికెట్‌ చార్జీలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి.  ప్రధాన ఎయిర్‌లైన్స్‌ ఇండిగో, గో ఎయిర్‌  తమ సర్వీసులను రద్దు  చేయడంతో  కొన్ని కీలక మార్గాల్లో చార్జీల మోత  మోగుతోంది. ముఖ్యంగా రద్దయిన విమానాలకు చెందిన ప్రయాణీకులు సదరు టికెట్లను కాన్సిల్‌ చేసుకోవడం, తిరిగి టికెట్లను  బుక్‌ చేసుకోవడం తప్పనిసరి.  కొన్ని ప్రధానమైన రూట్లలో  10శాతం చార్జీలు పెరిగాయి. దీంతో వేలాది మంది  విమానప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

దేశీయ  పెద్ద విమానయాన సం‍స్థలు  ఇండిగో దాదాపు 65 విమానాలను, గో ఎయిర్‌ 11 విమానాలను రద్దు చేయడంతో   లాస్ట్‌ మినిట్‌ ప్రయాణీకులకు భారీ  షాక్‌ తగిలింది. విమానాలు రద్దు చేయడం కొన్ని కీలక మార్గాల్లో అత్యవసరంగా ప్రయాణించే  ప్రయాణీకులపై గణనీయమైన ప్రభావాన్ని చూపిందని ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌  ప్రతినిధి శరత్‌ దలాల్‌ తెలిపారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైల మధ్య  వన్‌వే టికెట్లు రూ.12వేల ధర పలికినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పుంజుకునే అవకాశం ఉందని అంచనావేశారు. దాదాపు 5-10శాతం పెరుగుదల ఉంటుందన్నారు.  టైర్ -2 విమానాల ఛార్జీలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ,  భువనేశ్వర్ మధ్య చివరి నిమిషంలో బుక్‌ చేసుకున్న టికెట్‌ చార్జీలు రూ .7వేలు- రూ .29వేలు ఉండగా, బుధవారం  నాటి ధరలు రూ.9వేలనుంచి -రూ.27వేలుగా ఉంది. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై రూట్‌లో కూడా  బుధవారం దాదాపు రూ. 5వేలు-24వేల మధ్య పలుకుతుండటం గమనార్హం.

ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌ అందించిన సమాచారం  ఇండిగో బుధవారం 42 విమానాలను రద్దు చేసింది. ముంబయి, కోల్‌కతా పుణె, జైపూర్, శ్రీనగర్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, డెహ్రాడూన్, అమృత్‌సర్‌, బెంగళూరు, హైదరాబాద్‌ రూట్లు ఇందులో ఉన్నాయి. అయితే గో ఎయిర్‌కు సంబంధించిన వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. మరోవైపు ప్రయాణీకుల ఇబ్బందులకు తొలగించేందుకు చర్యలు తీసుకంటామని   ఇరు సంస్థలు పేర్కొన్నాయి.  కాన్సిలేషన్‌ చార్జీలు రద్దు,  రీషెడ్యూలింగ్‌ లాంటి చర్యలు చేపట్టుతున్నటు నిన్న ప్రకటించాయి.

కాగా  డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ప్రాట్‌ అండ్‌ విట్నీఇంజిన్ల వైఫల్యాల కారణంగా ఎ320 నియో(న్యూ ఇంజిన్‌ ఆప్షన్‌) విమానాలను నిలిపివేస్తోంది. సోమవారం అహ్మదాబాద్‌ నుంచి లక్నో మీదుగా కోల్‌కతా వెళ్తున్న ఇండిగోకు చెందిన ఎయిర్‌ బస్‌ ఏ320 నియో విమానం ఎగిరిన కొన్ని నిమిషాలకే దాంట్లోని పిడబ్ల్యూ 1100 ఇంజన్‌ మొరాయించిన కొన్ని గంటల్లోనే డీజీసీఏ ప్రాట్‌ అండ్‌ విట్నీ ఇంజిన్ల వైఫల్యాలున్న ఎ320 నియో విమానాలు నిలిపివేత ప్రారంభించింది. విమానాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీసీఏ తెలిపింది.  ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పట్నా, శ్రీనగర్‌, భువనేశ్వర్‌, అమృత్‌సర్‌, గౌహతి తదితర నగరాల నుంచి వెళ్లాల్సిన కొన్ని విమానాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే.  దేశీయ విమానయాన రంగంలో ఇండిగోకు 40శాతం, గోఎయిర్‌కు 10శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top