న్యూఢిల్లీ: ఇండిగో విమానాల రద్దు వల్ల దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన తరుణంలో కేంద్రం దృష్టి సారించింది. ఇండిగో విమానాల రద్దుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ మేరకు విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు డీజీసీఏ పరిస్థితిన సమీక్షిస్తూ ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా విమానయాన మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. ఇండిగో సంక్షోభంలో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణమైన వారిని శిక్షిస్తామన్నారు. పైలట్ల రోస్టర్ సిస్టమ్ పూర్తిగా నిలిపివేసిన కేంద్రం.. ప్రయాణికుల సంక్షేమం, భద్రత తమ బాధ్యత అని ఈ సందర్భంగా పేర్కొంది. ప్రయాణికుల కొరకు కంట్రోల్ రూమ్ నంబర్ 011 2461 0843 2469 3963 ఏర్పాటు చేసింది కేంద్రం.
ఇదిలా ఉంచితే, సిబ్బంది కొరత కారణంగా ఇండిగో సంస్థ ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొన్ని రోజులుగా ప్రయాణికులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాము. చాలా మంది ప్రయాణికుల ప్రయాణాలు రద్దయ్యాయి. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యే సమాచారం లేక చాలామంది ఎయిర్ పోర్టులలో చిక్కుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యను పరిష్కరించడానికి ఇండిగో అన్ని ప్రయత్నాలు చేస్తుందని పేర్కొంది. ఇంత పెద్ద సమస్య ఒక్క రాత్రిలో పరిష్కారం కాదని ప్రయాణికులు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ తన అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.
ప్రయాణికులకు ఇండిగో సూచనలు
రద్దైన విమానాల టికెట్ ఛార్జీలు ఆటోమెటిక్ గా ప్రయాణికుల అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి.
క్యాన్సిల్ టికెట్స్ కు 100 శాతం రీఫండ్ చేయబడుతుంది. అదే విధంగా 05 నుంచి 15 తారీఖు వరకూ రీషెడ్యూల్ రిక్వెస్టులు స్వీకరించబడతాయి.
ప్రస్తుతం ఎయిర్ పోర్టుల్లో చిక్కుకున్న వారికోసం పరిసర ప్రాంతాలలోని హోటల్ రూమ్స్ బుక్ చేయబడతాయి.
అదేవిధంగా ప్రయాణికులకు స్నాక్స్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వృద్ధులు,దివ్యాంగులకోసం లాంజ్ సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.
ప్రయాణికులు తమ ఫ్లైట్స్ ల వివరాలు అధికారిక వెబ్ సైట్లలో చూసుకోవాలని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయితే దయచేసి విమానాశ్రయానికి రాకూడదని తెలిపింది. ఇండిగో ఫ్లైట్స్ విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి తమ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని దయచేసి ప్రయాణికులు సహకరించాలని కోరింది.
ఏమి జరిగింది?
గత కొన్ని రోజుల్లో 1,000కిపైగా ఇండిగో విమానాలు రద్దయ్యాయి. కేవలం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాల్లో వందల సంఖ్యలో విమానాలు నిలిచిపోయాయి.
డీజీసీఏ కొత్తగా అమలు చేసిన Flight Duty Time Limit (FDTL) నియమాలు పైలట్ల అలసటను తగ్గించేందుకు కఠినంగా అమలు చేయడం వల్ల, ఇండిగోలో క్రూ షెడ్యూలింగ్ పూర్తిగా దెబ్బతింది.


