విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం పట్టి కుదిపేస్తోంది. ఉన్నట్టుండి టికెట్లు బుక్ చేసుకున్న విమానాలు రద్దు కావడంతో ప్రయాణీకుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకరికి ఉద్యోగం, మరొకరికి అనారోగ్యం, మరొకరికి వేరొక అత్యవసర పరిస్థితి కారణంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకుంటే, చివరి నిమిషంలో విమానాల రద్దుతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫలితంగా ఒక కొత్త జంట సొంత రిసెప్షన్కు హాజరు కాలేని పరిస్థితి. వేరే దారి లేక ఆన్లైన్లో రిసెప్షన్కు హాజరయ్యారంటే ఈ సంక్షోభం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కొత్త ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తన రోస్టర్ ప్లానింగ్లో తగినంత మార్పులు, పైలట్ల కొరత కారణంగా ఈ వారం భారతదేశం అంతటా వందలాది విమానాలను రద్దు చేసింది. దీంతో కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఊహించని పరిణామం వెలుగులోకి వచ్చింది. నూతన వధూవరులు తమ సొంత రిసెప్షన్కు వర్చువల్గా హాజరు కావాల్సి వచ్చింది.
A newly wed techie couple forced to attend their own reception online after their Indigo flights from Bhubaneswar-Hubbali were cancelled. The bride’s parents having already invited relatives decided to broadcast their live feed on a big screen. #IndigoDelay #FlightCancellations pic.twitter.com/jO7lTgm8lZ
— Deepak Bopanna (@dpkBopanna) December 5, 2025
బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హుబ్బళ్లికి చెందిన మేధా క్షీర్సాగర్ , ఒడిశా భువనేశ్వర్కు చెందిన సంగమ దాస్ నవంబర్ 23న భువనేశ్వర్లో వివాహం చేసుకున్నారు. బుధవారం వధువు స్వస్థలంలో అధికారిక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హుబ్బళ్లిలోని గుజరాత్ భవన్లో జరగాల్సి ఉంది.వీరు భువనేశ్వర్ నుండి బెంగళూరుకు అక్కడినుంచి హుబ్బళ్లికి వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. డిసెంబర్ 2న భువనేశ్వర్ నుండి బెంగళూరుకు , తరువాత హుబ్బళ్లికి టిక్కెట్లు బుక్ చేసుకున్న వధూవరులు, మంగళవారం ఉదయం 9 గంటల నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు విమానాలు పదేపదే ఆలస్యం కావడంతో చిక్కుకుపోయారు. చివరికి డిసెంబర్ 3న విమానం రద్దైంది. వీరితోపాటు భువనేశ్వర్-ముంబై-హుబ్బళ్లి మీదుగా ప్రయాణించే అనేక మంది బంధువులకు ఇదే ఇబ్బంది తప్పలేదు.
మరోవైపు రిసెప్షన్ వేదిక వద్ద చుట్టాలు, పక్కాలు అందరూ విచ్చేశారు. సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని బంధుమిత్ర సపరివార సమేతంగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో విమానాల రద్దు వార్త అశనిపాతంలా తాకింది. ఇక చేసేదేమీ లేకవధువు తల్లిదండ్రులు రంగంలోకి దిగి ఆన్లైన్లోనే తంతు ముగించారు. రిసెప్షన్ కోసం సిద్ధం చేసుకున్న దుస్తులతో వధూవరులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రిసెప్షన్లో చేరారు. టీవీ స్క్రీన్మీదే ఆన్లైన్లోనే నూతన దంపతులను ఆశీర్వదించారు.
వారు వస్తారని ఆశించాం కానీ వారు రాలేకపోయారు. బంధువులందర్నీ పిలుచుకున్నాం, కానీ ఇలా జరగడం బాధనిపించింది. అలాగని అన్నీ ఏర్పాట్లు చేశాక, ఈవెంట్ను రద్దు చేయలేం. అందుకే అందరితోనూ చర్చించి రిసెప్షన్కు ఆన్లైన్లో హాజరు కావాలని వారి భాగస్వామ్యాన్ని స్క్రీన్పై ప్రసారం చేయాలని నిర్ణయించుకున్నామని వధువు తల్లి చెప్పారు.

ఇండిగో విమానాలు రద్దు
ఢిల్లీ, జైపూర్, భోపాల్, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఇతర నగరాల్లోని విమానాశ్రయాలలో ఇండివిమాన కార్యకలాపాలు స్థంభించి పోయాయి. వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. గురువారం, రోజుకు దాదాపు 2,200 విమానాలను నడుపుతున్న ఇండిగో గురువారం 500 కంటే ఎక్కువ విమానాలను రద్దు చేసింది, ఇది దాని 20 సంవత్సరాల చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 నాటికి కార్యకలాపాలు పూర్తిగా స్థిరీకరించే అవకాశం ఉందని అంచనా. విమాన విధి నిబంధనలలో తాత్కాలిక సడలింపులను కోరిందని ఏవియేషన్ వాచ్డాగ్ DGCAకి తెలిపింది.


