ఎయిర్‌పోర్టులలో గందరగోళం.. ప్రయాణికుల ఆగమాగం | Ayyappa Devotees Protest At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

Indigo Crisis: ఎయిర్‌పోర్టులలో గందరగోళం.. ప్రయాణికుల ఆగమాగం

Dec 5 2025 7:58 AM | Updated on Dec 5 2025 12:49 PM

Ayyappa Devotees Protest At Shamshabad Airport

సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్‌: ఇండిగో విమానాల రద్దు కారణంగా ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌, ఢిల్లీ, ముంబై, బెంగళూరు.. ఇలా ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకులు పడిగాపులు కాస్తున్నారు. సరైన సమాచారం ఇవ్వకపోవడం.. వసతులు కల్పించడంలో విఫలం కావడంతో ఇండిగో తీరుపై ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

విమాన సర్వీసుల రద్దు విషయంలో ఇండిగో తన చెత్త రికార్డు తానే బద్ధలు కొట్టుకుంది. ఇవాళ ఒక్కరోజే 600కి పైగా విమానాలను రద్దు చేసింది. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 220 విమానాలు ఉండడం గమనార్హం.  అలాగే ముంబైకి వెళ్లే 100 విమానాలను క్యాన్సిల్‌ చేసింది. ఇటు హైదరాబాద్‌లోనూ దాదాపు 80కిపైగా ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి. నేటి అర్ధరాత్రి దాకా ఈ రద్దు ఉంటుందని ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

ప్రయాణికుల తీవ్ర అవస్థలు
సిబ్బంది కొరతే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.  ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ నిబంధనలతో పైలెట్ల కొరత నెలకొంది. ఇండిగోతో పాటు ఇతర విమానయాన సంస్థలపైనా ఈ ప్రభావం పడింది. అయితే ఇండిగో దేశంలోనే అత్యధికంగా విమానాలు నడిపే సంస్థ కావడం, అప్పటికే అక్కడి సిబ్బంది కొరత ఉండడంతో ఎఫెక్ట్‌ ఈ స్థాయిలో కనిపిస్తోంది. 

 

 ఈ ప్రభావంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విమానాలు ఎప్పుడు ఎగరతాయో.. తమను ఎప్పుడు తీసుకెళ్తారో అని ఎదురు చూస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో తమకు సరైన సదుపాయాలు అందించడం లేదని పలువురు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇటు.. వాళ్లకు సరైన సమాచారం అందించలేక ఇండిగో క్షమాపణలు చెబుతోంది. వెరసి.. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టులలో గందరగోళం కొనసాగుతోంది.

ఇండిగో విమానాలు రద్దు కావడంతో.. అటు  మిగిలిన విమాన సంస్థలు దోపిడీకి దిగాయి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి టికెట్‌ ధరలను పెంచేశాయి. ఏకంగా 40వేలు ఛార్జ్‌ చేస్తున్నాయి.

శంషాబాద్‌లో ఉద్రిక్తత 
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అ‍య్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటల పాటు ఆలస్యం కావడంతో స్వాములు నిరసనకు దిగారు.

షెడ్యూల్‌ ప్రకారం.. ఇండిగో విమానం గురువారం సాయంత్రం హైదరాబాద్‌ నుంచి కొచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ విమానంలో వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సాయంత్రమే శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానం శుక్రవారం ఉదయానికి కూడా బయలుదేరాకపోవడంతో అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. 12 గంటలుగా తాము విమానాశ్రయంలోనే ఉన్నట్టు తెలిపారు. విమానం గురించి తమకు సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరోవైపు.. గురువారం ఉదయం కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. కేరళకు వెళ్లే ఇండిగో విమానం అకస్మాత్తుగా రద్దు కావడంతో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇలా ఎలా విమానం రద్దు చేస్తారు?” అంటూ భక్తులు విమానాశ్రయ అధికారులను ప్రశ్నించారు. విమాన రద్దుకు ప్రత్యామ్నాయంగా వెంటనే మరో సర్వీస్‌ను ఏర్పాటు చేయాలని లేదా ప్రత్యేక విమానాన్ని నడపాలని భక్తులు డిమాండ్ చేశారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ అసౌకర్యం పెరగడంతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement