దేశంలో విమానాల రద్దు సంఘటనలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దేశీయ సర్వీసుల్లో ఇవి ఎక్కువ ఉంటున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ పౌర విమానయాన సంస్థ ఇండిగో.. భారీగా విమానాల రద్దుతో వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో విమానాలు క్యాన్సిల్ అయినప్పుడు విమానయాన సంస్థల బాధ్యతలు ఏంటి.. డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ప్రయాణికులుగా మనకు ఎటువంటి హక్కులు ఉంటాయి.. ఈ కథనలో తెలుసుకుందాం..
భారతదేశంలో విమానాలు రద్దు అయినప్పుడు డీజీసీఏ (DGCA డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు ప్రయాణికులకు రిఫండ్, ప్రత్యామ్నాయ విమానం, భోజనం/హోటల్ సౌకర్యం వంటి బాధ్యతలు వహించాలి. అలాగే ప్రయాణికులకు పాసింజర్ ఛార్టర్ ఆఫ్ రైట్స్ ద్వారా కొన్ని స్పష్టమైన హక్కులు కల్పించారు.
విమానయాన సంస్థల బాధ్యతలు
సమయానికి సమాచారం ఇవ్వాలి: విమానం క్యాన్సిల్ అయితే ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా ముందుగానే తెలియజేయాలి.
ప్రత్యామ్నాయ విమానం: అదే గమ్యస్థానానికి మరో విమానం ఉచితంగా ఏర్పాటు చేయాలి.
రిఫండ్: ప్రయాణికుడు కోరుకుంటే పూర్తి టికెట్ ధర రిఫండ్ చేయాలి.
భోజనం/హోటల్ సౌకర్యం: విమానం క్యాన్సిల్ లేదా 2 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే ప్రయాణికులకు భోజనం, రిఫ్రెష్మెంట్ వసతి కల్పించాలి. అదే 24 గంటలకంటే ఎక్కువ ఆలస్యం అయితే హోటల్ వసతితోపాటు ట్రాన్స్ఫర్(స్థానిక రవాణా) సౌకర్యం కల్పించాలి.
ప్రయాణికుల హక్కులు ఇవే..
విమానం క్యాన్సిల్ అయితే ప్రయాణికులు ఛార్జీలు రిఫండ్ తీసుకోవచ్చు లేదా మరో విమానంలో ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఓవర్బుకింగ్ వల్ల ప్రయాణికుడికి సీటు దొరకకపోతే టికెట్ పూర్తి రిఫండ్తోపాటు పరిహారం పొందవచ్చు.
లగేజీని విమానయాన సంస్థలు పోగొడితే నిబంధనల ప్రకారం ప్రయాణికులు పరిహారం పొందవచ్చు.
విమానాల ఆలస్యం లేదా క్యాన్సిలేషన్పై స్పష్టమైన సమాచారం పొందే హక్కు ప్రయాణికులకు ఉంటుంది.
డీజీసీఏ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
ప్రయాణికులు 7 రోజులు ముందే విమాన టికెట్ బుక్ చేసి, 24 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రిఫండ్ పొందవచ్చు.
విమానాలు 2 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా భోజనం, రిఫ్రెష్మెంట్ సౌకర్యం కల్పించాల్సిందే.
24 గంటలకు మించి ఆలస్యమైతే ఉచితంగా హోటల్ వసతి, స్థానిక రవాణా ఏర్పాట్లు చేయాలి.
విమానాల క్యాన్సిలేషన్ సందర్భంలో పూర్తి రిఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలి.
అయితే సేఫ్టీ కారణాలు (వాతావరణం, టెక్నికల్ సమస్యలు) రీత్యా విమానాలు ఆలస్యం లేదా రద్దు అయితే రిఫండ్/రీబుకింగ్ తప్పనిసరి. కానీ అదనపు పరిహారం ఇవ్వకపోవచ్చు.


