మెర్సిడెస్ నుంచి మరో మూడు మోడళ్లు | 2014 Mercedes-Benz A-Class and B-Class Edition 1 launched in India | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ నుంచి మరో మూడు మోడళ్లు

Jun 26 2014 1:52 AM | Updated on Aug 20 2018 8:10 PM

మెర్సిడెస్ నుంచి మరో మూడు మోడళ్లు - Sakshi

మెర్సిడెస్ నుంచి మరో మూడు మోడళ్లు

లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది.

ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 60 శాతం
సాక్షితో మెర్సిడెస్ బెంజ్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సేల్స్, నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్ ఫిజ్ తెలిపారు. ఏ-క్లాస్, బి-క్లాస్ కార్ల లిమిటెడ్ ఎడిషన్ కార్లను హైదరాబాద్ మార్కెట్లో బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రాబోయే మోడళ్ల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, మార్కెట్ తీరుకు అనుగుణంగా ఇవి ఉంటాయని చెప్పారు. 2013లో 8 మోడళ్లు విడుదల చేశామన్నారు. గతేడాది 9 వేలకుపైగా కార్లను విక్రయించామని, ఈ ఏడాది రెండింతల వృద్ధి రేటు నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
60 శాతం వాటా..
మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో గతంలో ఢిల్లీ, ముంబై నగరాల వాటా 60 శాతముండేది. ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 60%గా ఉందని బోరిస్ తెలిపారు. కొత్త ప్రభుత్వం రాకతో మౌలిక వసతులు, రోడ్లు మరింత విస్తరిస్తాయన్న అంచనాలున్నాయని, దీంతో రానున్న రోజుల్లో లగ్జరీ కార్లకు గిరాకీ పెరుగుతుందని వివరించారు. ప్రీ-ఓన్డ్ విభాగంలో కార్ల అమ్మకాలు గణనీయంగా ఉన్నాయని చెప్పారు. బ్రాండ్ వృద్ధికి దోహదం చేస్తోందని తెలిపారు. ఈ విభాగాన్ని మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.
 
డాలరు ప్రభావముంది..

గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ పలుమార్లు కార్ల ధరల సవరణ చేసింది. రూపాయి ఒడిదుడుకులకు లోనై దిగుమతి వ్యయం పెరగడంతో కార్ల ధరపై ఒత్తిడి ఉందని కంపెనీ తెలిపింది. బడ్జెట్‌లో ప్రకటించే ఉద్దీపనలనుబట్టి కార్ల ధర నిర్ణయిస్తామని వెల్లడించింది. 40 శాతం విడిభాగాలను కంపెనీ దేశీయంగా సేకరిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ హైదరాబాద్ డీలర్ అయిన మహవీర్ మోటార్స్ చైర్మన్ యశ్వంత్ జబఖ్ మాట్లాడుతూ రూ.2 కోట్లు ఖరీదున్న ఏఎంజీ మోడళ్లకు సైతం ఇక్కడ కస్టమర్లున్నారని చెప్పారు. 2013లో మొత్తం 460 కార్లు విక్రయించామని, ఈ ఏడాది 20 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement