నీచ రాజకీయాలను ఓటుతో ఓడిద్దాం

YSRCP Leader YS Jaganmohan Reddy Who is Providing Clean Rule to The People by The Chief Minister - Sakshi

సాక్షి, రాయవరం: టీడీపీ నీచ రాజకీయాలను ఓటుతో ఓడిద్దామని, ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించే వైఎస్సార్‌ సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ పిలుపునిచ్చారు. రాయవరంలో ఆయన గురువారం ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. రాయవరం బస్టాండ్‌ సెంటర్‌లో సత్తి ఆంజనేయరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి ప్రారంభించారు.

అనంతరం బోస్‌ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అండగా ఉంటానంటూ 600 అబద్ధపు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఆదరిస్తే సమాజంలోని అన్ని వర్గాల వారికి అండగా నిలుస్తారన్నారు. అందుకే నవరత్నాల పథకాలను ప్రవేశ పెట్టారన్నారు. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత పార్టీ నేతలు, కార్యకర్తలపై ఉందన్నారు.

పార్టీ గుర్తు ఫ్యాన్‌పై ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీకి ప్రజలకు జవాబుదారీగా ఉంటారన్నారు. పార్టీ నేత వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డిని, నియోజకవర్గంలో బోస్‌ను గెలిపించుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. ప్రతి నాయకుడు, కార్యకర్త సుశిక్షితులైన సైనికుల్లా ఎన్నికల్లో పని చేయాలన్నారు.

బోస్‌ వెంట వైఎస్సార్‌ సీపీ నేతలు వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, జెడ్పీటీసీ చిన్నం అపర్ణాపుల్లేష్, మాజీ ఎంపీపీ నల్లమిల్లి విజయభాస్కరరెడ్డి, చందు, కర్రా ఆదినా రాయణ, కర్రా వెంకటేశ్వరరావు, పార్టీ ప్రచార కమిటీ జిల్లా కన్వీనర్‌ సిరిపురపు శ్రీనివాసరావు, ప్రముఖ బీసీ నేత గుబ్బల తులసికుమార్, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెంకే వెంకట్రావు, పార్టీ నేతలు ఆర్‌వీవీఎస్‌ చౌదరి, ధూళిపూడి వెంకటేశ్వరరావు, ఆరిఫ్, కోట వెంకట్రావు, పడాల కమలారెడ్డి, సత్తి ఆంజనేయరెడ్డి, మంతెన అచ్యుతరామచంద్రరాజు, తాడి రామచంద్రారెడ్డి, రావాడ శ్రీను, వుండవిల్లి రామకృష్ణ, మేడపాటి బసివిరెడ్డి, వెలగల సత్యనారాయణరెడ్డి, బొడ్డు శ్రీను, చింతపట్ల మల్లిబాబు, మేడపాటి వెంకటసుబ్బారెడ్డి, కొదంగుళ్ల జగదీష్, గుత్తుల లాల్‌కిషోర్, గడిదేశి చంద్రశేఖర్, సాదే రామ్మూర్తి, తవిటికి రత్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ కోట
రాయవరం మాజీ ఎంపీపీ కోట బాబూరావు, అన్న కుమారుడు కోట వెంకటనాగులు భారీగా తన అనుచరులతో కలిసి బోస్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా వేసి బోస్‌ కోటను ఆహ్వానించారు. వెలమ సంఘం నేత, వార్డు మాజీ సభ్యుడు కొల్లి రాంబాబు భారీగా తన అనుచరులతో కలిసి బోస్‌ సమక్షంలో పార్టీలో చేరారు. అలాగే టీడీపీ నుంచి దళిత నేతలు గంటి జాన్సన్, నేతల రాజు, అతని అనుచరులు పార్టీలో చేరగా, బోస్‌ పార్టీ కండువా వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే దళిత నేతలు చంద్రమళ్ల రామకృష్ణ, బొట్టా చంద్రరావు ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీలో చేరగా, బోస్‌ వారికి కండువాలను కప్పారు. 

ఉప్పొంగిన ఉత్సాహం
కార్యకర్తల ఉత్సాహం.. అభిమానుల కేరింతలతో రాయవరంలో ప్రచారం సాగింది.  పోలమ్మతల్లి ఆలయం, అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో బోస్‌ పూజాదికాలు నిర్వహించారు. అనంతరం తన రాజకీయ గురువు రాయవరం మునసబు విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో ప్రచారం చేపట్టారు. స్థానిక వైద్యులు జీఎస్‌ఎన్‌ రెడ్డి, తేతలి నవీన్‌రెడ్డిను కలుసుకుని వైఎస్సార్‌సీపీకి మద్దతు పలకాల్సిందిగా కోరారు. గ్రామంలో అడుగడుగునా బోస్‌కు ఘన స్వాగతం లభించింది. ప్రచారం ఆద్యంతం ఉత్సాహపూరిత వాతావరణంలో పండుగను తలపించింది. అనంతరం బోస్‌ వి.సావరం, వెదురుపాక, నదురుబాద గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామ గ్రామాన ప్రజలు బోస్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. పలు చోట్ల మహిళలు బోస్‌కు హారతులు ఇచ్చారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top