సాక్షి, గుంటూరు : జిల్లాలో సమైక్యాంధ్ర పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు బుధవారం దీక్షలు ప్రారంభించనున్నారు.
నేటి నుంచి వైఎస్సార్ సీపీ దీక్షలు
Oct 2 2013 12:57 AM | Updated on Sep 27 2018 5:56 PM
సాక్షి, గుంటూరు : జిల్లాలో సమైక్యాంధ్ర పోరాటాన్ని ఉధృతం చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనుంది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు బుధవారం దీక్షలు ప్రారంభించనున్నారు. సమన్వయకర్తలతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరాహార దీక్షల్లో పాల్గొననున్నాయి. వైఎస్సార్ సీపీ నెలరోజుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా మహాత్మాగాంధీ జయంతి రోజైన బుధవారం జిల్లాలోని 17 నియోజకవర్గాల కేంద్రాల్లో సమైక్య నినాదం మార్మోగనుంది.
జిల్లా కేంద్రం గుంటూరులోని రెండు నియోజకవర్గాల్లో వేర్వేరు చోట్ల దీక్షలు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు చేపట్టను న్నారు. నగర కన్వీనర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగనున్నారు. తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్ అహ్మద్లు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలోని నరసరావుపేట సెంటర్లో దీక్షకు దిగనున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అమెరికా పర్యటనలో ఉన్నందున ఆ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొననున్నారు.
మాచర్లలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో అంబటి రాంబాబు దీక్షకు కూర్చొంటారు. మంగళగిరిలోని బస్టాండ్ సెంటర్లో దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం ఎదుట గుంటూరు, కృష్ణా జిల్లాలు, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తారు. పొన్నూరులోని ఐలాండ్ సెంటర్లో రావి వెంకటరమణతో పాటు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, సర్పంచ్లు నిరాహార దీక్షల్లో పాల్గొంటారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్లలోని ఏడుకొట్ల సెంటర్లో జంగా కృష్ణమూర్తి, బాపట్లలోని గడియారం స్తంభం సెంటరులో కోన రఘుపతి, నరసరావుపేటలోని ఆర్డీవో కార్యాలయం వద్ద గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడికొండలో మెయిన్ సెంటర్లో ఈపూరి అనూప్, మందపాటి శేషగిరిరావు, కొల్లిపర రాజేంద్రప్రసాద్, వేమూరులో మేరుగ నాగార్జున ఆమరణ దీక్ష చేపట్టనున్నారు.
తెనాలిలోని ప్రకాశం రోడ్డులో గుదిబండి చిన వెంకటరెడ్డి, పెదకూరపాడులోని బస్టాండ్ సెంటరులో మహానేత వైఎస్ విగ్రహం వద్ద నూతలపాటి హనుమయ్య, బొల్లా బ్రహ్మనాయుడు, లాలుపురం రాము, రేపల్లెలో తాలూకా సెంటర్లో మోపిదేవి హరనాథ్బా బు, వినుకొండలో నన్నపనేని సుధ ఆధ్వర్యంలో దీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సమైక్య రాష్ట్రాన్ని కోరుతూ రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గాల కో ఆర్డినేటర్లతో పాటు పార్టీ శ్రేణులు దీక్షకు మద్దతు తెలుపనున్నాయి.
Advertisement
Advertisement