ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్ | ys jagan mohan reddy not going to attend chandrababu naidu swearing- in ceremony | Sakshi
Sakshi News home page

ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్

Jun 7 2014 9:57 AM | Updated on Jul 25 2018 4:09 PM

ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్ - Sakshi

ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్

తాము అధికారం కోల్పోయినందుకు సమీక్ష చేయలేదని, సంస్థాగత తప్పులను అధిగమించడంపై చర్చించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

రాజమండ్రి : తాము అధికారం కోల్పోయినందుకు సమీక్ష చేయలేదని సంస్థాగత తప్పులను అధిగమించడంపై చర్చించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓడిన స్థానాల్లో ఎందుకు దెబ్బ తగిలిందో విశ్లేషించుకున్నామని ఆయన చెప్పారు.  తాము గతంలో ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి 9 మంది ఎంపీలు, 70మంది ఎమ్మెల్యేలకు తమ పార్టీ సంఖ్య పెరిగిందన్నారు.

రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం డ్రామా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ అవుతాయో చెబితేనే తొలి సంతకానికి అర్థం ఉంటుందన్నారు. రుణమాఫీపై ఎల్లో మీడియా, చంద్రబాబు ఓ పథకం ప్రకారం డ్రామా నడిపిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. కొత్త రాజధానికి డబ్బులు లేవని ఓవైపు చందాలు అడుగుతున్న ఆయన మరోవైపు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.

ఇటువంటి సమయంలో ఏ అవసరం లేకున్నా అంత ఖర్చు చేయడం ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రూ.5వేలు, రూ.10వేలు కూడా రాజధాని కోసం విరాళాలు అడుగున్నవారు ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. అటువంటి కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. ఆ వృధా ఖర్చులో తాను భాగస్వామిని కాలేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తేవాలని తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అంశంపైనా పోరాడుతామని ఆయన తెలిపారు.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement