breaking news
swearing- in ceremony
-
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి.. ఏర్పాట్లు చకచకా
విజయవాడ/సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జరగనున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. వచ్చే గురువారం మధ్యాహ్నం 12.23గంటలకు జరిగే ఈ కార్యక్రమం కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. స్టేడియంను సోమవారం లెవలింగ్ చేసి వాటరింగ్ చేశారు. భారీ వాటర్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. గ్యాలరీలు, బారికేడింగ్ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. స్టేడియంతోపాటు నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నారు. స్టేడియంకు వచ్చే రహదారులకు మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయి. సిటీ కేబుల్తోపాటు అన్ని లోకల్ చానల్స్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. స్టేడియంలో ఏఏ, ఏ1, ఏ2.. ఇలా వివిధ కేటగిరీల కింద మొత్తం 18రకాల గ్యాలరీలు, మీడియాకు ప్రత్యేకంగా ఒకటి ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో గ్యాలరీకి ఇద్దరు అధికారులను నియమించారు. గవర్నర్, జ్యుడీషియరీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటుచేస్తున్నారు. వీరందరికీ కలిపి సాధారణ పరిపాలనా విభాగం నుంచి 11,500ల పాస్లు జారీచేయనున్నారు. స్టేడియంలో మిగిలిన గ్యాలరీల్లోకి సామాన్య ప్రజలను వేరే గేట్ ద్వారా అనుమతిస్తారు. ఈ 11,500 పాస్లు పోను.. సుమారు 15వేల నుంచి 20వేల మంది సామాన్య ప్రజలను సాధారణ గ్యాలరీలలోకి అనుమతిస్తారు. డీజీపీ, సీపీ ఏర్పాట్ల పరిశీలన కాగా, డీజీపీ ఆర్పీ ఠాకుర్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావులు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను సోమవారం స్వయంగా పరిశీలించారు. పలు అంశాలపై డీజీపీ కొన్ని సూచనలు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, శ్రీకాంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి తదితర నేతలు కూడా ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేసే ప్రాంతాలివే.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని ఫుట్బాల్ గ్రౌండ్, బెంజిసర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, స్వరాజ్య మైదానం, ఆర్టీసీ బస్టాండ్, బీఆర్టీఎస్ రోడ్డు, కేదారేశ్వరపేట, పంజా సెంటర్, స్వాతి రోడ్డు జంక్షన్, కాళేశ్వరరావు మార్కెట్, పైపులరోడ్డు, సింగ్నగర్ ఫ్లైఓవర్, డాబాకొట్లు సెంటర్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, రైల్వేస్టేషన్, పాత గవర్నమెంట్ ఆస్పత్రి రోడ్డు, బెరంపార్కు, రామవరప్పాడు సెంటర్, సిద్దార్థ కాలేజి, కానూరు రోడ్డులలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పార్కింగ్ ప్రదేశాలు ఇవే.. రాత్రి 8 గంటలకు డీజీ గౌతం సవాంగ్ వచ్చి ఏర్పాట్ల గురించి నగర సీపీ ద్వారకా తిరుమలరావును అడిగి తెలుసుకున్నారు. సవాంగ్తో పాటు కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఏడీజీ కుమార విశ్వజిత్ వచ్చారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సవాంగ్ సూచించారు. స్టేడియంలో భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లపై డీసీపీలు రాజకుమారి, హర్షవర్ధన్రాజు. రవిశంకర్రెడ్డిలకు పలు సూచనలు చేశారు. కాగా, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే నాయకులకు సంబంధించిన వాహనాల పార్కింగ్కు ప్రత్యేకంగా స్థలాలను గుర్తించామని సీపీ తెలిపారు. అవి.. - హైదరాబాద్, చెన్నై, విశాఖ మార్గాల్లో వచ్చే వాహనాలు.. ఎక్కడికక్కడ శివారు ప్రాంతాల్లోనే ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటుచేస్తున్నారు. - సీఎం కుటుంబ సభ్యులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ సీఎంలు, అపాట్, ఆర్టీఐ కమిషనర్ల వాహనాలకు మాత్రమే ఇందిరాగాంధీ మైదానంలో పార్కింగ్ ఉంటుంది. - మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్లతోపాటు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖుల వాహనాలకు మాత్రం ఏఆర్ గ్రౌండ్లోనూ.. ఇతర ముఖ్య అధికారులు, పోలీసు, ఇతర అధికారుల వాహనాలను బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ను కేటాయించనున్నామన్నారు. - మాజీ ఉన్నతాధికారుల వాహనాలకు ఆర్టీఏ ఆఫీస్ ప్రాంగణం కేటాయించారు. - ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలు రామవరప్పాడు సమీపంలో.. హైదరాబాదు వైపు నుంచి వచ్చే వాహనాలు గొల్లపూడి సమీపంలో, మచిలీపట్నం వైపు నుంచి వచ్చే వాహనాలు కానూరు సమీపంలో, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజ టోల్గేటు సమీపంలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లుచేస్తామని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎవరికీ ఇబ్బందుల్లేకుండా చూడండి : కలెక్టర్ మరోవైపు.. సీఎం ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లకు సంబంధించి కృష్ణాజిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమానికి వచ్చే అతిథులు, ఆహ్వానితులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయా శాఖల అధికారులు పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. వీఐపీల ప్రొటోకాల్ విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. దాదాపు రెండు లక్షల మజ్జిగ, లస్సీ ప్యాకెట్లు పంపిణీ చేయాలని.. మంచినీరు సరఫరాలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పార్కింగ్ ప్రదేశాలు అందరికీ తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో జేసీ కృతికా శుక్లా, విజయవాడ సబ్కలెక్టర్ మిషాసింగ్, ప్రొటోకాల్ జేడీ అశోక్, జేసీ–2 పి.బాబూరావు, ప్రమాణ స్వీకారోత్సవ కో–ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధి తలశిల రఘురాం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రాజస్ధాన్లో 23 మంది మంత్రుల ప్రమాణం
-
రాజస్ధాన్లో 23 మంది మంత్రుల ప్రమాణం
జైపూర్ : కొత్తగా కొలువుతీరిన రాజస్థాన్ ప్రభుత్వంలో 23 మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో 22 మంది మంత్రులు కాంగ్రెస్కు చెందిన ఎమ్మెల్యేలు కాగా ఆర్ఎల్డీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ సమక్షంలో రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో 13 మంది కేబినెట్ మంత్రులు, 10 మంది సహాయ మంత్రులచే గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో బులకి దాస్, శాంతికుమార్ దరివాల్, ప్రసాదిలాల్ మీనాలున్నారు. ఈనెల 17న రాజస్ధాన్ సీఎం, డిప్యూటీ సీఎంలుగా అశోక్ గెహ్లోత్, సచిన్ పైలట్లు మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా అధిష్టాన పెద్దలతో మూడు రోజుల పాటు విస్తృత సంప్రదింపులు జరిపారు. తీవ్ర తర్జనభర్జనలు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల ఎంపికపై కసరత్తు పూర్తిచేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ సహా 30 మందికి మంత్రులుగా అవకాశం ఉండగా మిగిలిన మరికొన్ని మంత్రి పదవులను తర్వాత విస్తరణలో భాగంగా భర్తీచేస్తారని భావిస్తున్నారు. -
బాబు ప్రమాణ స్వీకారానికి హరికృష్ణ,జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఆదివారం ఉదయం హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు విజయవాడ వెళ్లనున్నారు. అక్కడ నుంచి ఎన్టీఆర్ స్వగ్రామం నందమూరు వెళ్లి ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వీరు హాజరు అవుతారు. కాగా చంద్రబాబుతో ఉన్న విభేదాల కారణంగా సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఈసారి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉండటం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం ప్రచారం చేపట్టలేదు. ఎన్నికల్లో టికెట్ ఆశించిన హరికృష్ణకు చంద్రబాబు మొండి చేయి చూపించడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత హరికృష్ణ తన కుమారులతో కలిసి బాబును కలిసి అభినందించారు. విభేదాలు ఉన్నా వాటిని పక్కన పెట్టి సీతయ్య తన కుమారులతో కలిసి బావ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానుండటం విశేషం. -
వృథా ఖర్చులో భాగస్వామిని కాలేను
-
ఆ వృధా ఖర్చులో భాగస్వామిని కాలేను: వైఎస్ జగన్
రాజమండ్రి : తాము అధికారం కోల్పోయినందుకు సమీక్ష చేయలేదని సంస్థాగత తప్పులను అధిగమించడంపై చర్చించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రాజమండ్రి ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఓడిన స్థానాల్లో ఎందుకు దెబ్బ తగిలిందో విశ్లేషించుకున్నామని ఆయన చెప్పారు. తాము గతంలో ప్రతిపక్షంలోనే ఉన్నామని గుర్తు చేశారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి 9 మంది ఎంపీలు, 70మంది ఎమ్మెల్యేలకు తమ పార్టీ సంఖ్య పెరిగిందన్నారు. రైతు రుణమాఫీపై చంద్రబాబు నాయుడు తొలి సంతకం డ్రామా అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. తొలి సంతకం పెట్టినా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేదన్నారు. ఏ తేదీ నుంచి రుణాలు మాఫీ అవుతాయో చెబితేనే తొలి సంతకానికి అర్థం ఉంటుందన్నారు. రుణమాఫీపై ఎల్లో మీడియా, చంద్రబాబు ఓ పథకం ప్రకారం డ్రామా నడిపిస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. కొత్త రాజధానికి డబ్బులు లేవని ఓవైపు చందాలు అడుగుతున్న ఆయన మరోవైపు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి సమయంలో ఏ అవసరం లేకున్నా అంత ఖర్చు చేయడం ఎందుకని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రూ.5వేలు, రూ.10వేలు కూడా రాజధాని కోసం విరాళాలు అడుగున్నవారు ప్రమాణ స్వీకారానికి అంత ఖర్చు చేయడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. అటువంటి కార్యక్రమానికి తాను వెళ్లాల్సిన అవసరం లేదని జగన్ అన్నారు. ఆ వృధా ఖర్చులో తాను భాగస్వామిని కాలేనని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుపై ఒత్తిడి తేవాలని తమకు ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని జగన్ అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి అంశంపైనా పోరాడుతామని ఆయన తెలిపారు.