యువతకు తీరని ద్రోహం
యువతకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి
పట్నంబజారు: యువతకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైత న్య ఆధ్వర్యంలో, డివిజన్ నేతలు సిహెచ్ గౌతమ్, బి. అశోక్, ఫణింద్రారెడ్డి నేతృత్వంలో అమరావతిరోడ్డులోని 42వ డివిజన్కు చెందిన యువజనులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరారు. వారికి అప్పిరెడ్డి కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన చంద్రబాబు తీరా గద్దెనెక్కిన తరువాత ఏ ఒక్క హామీని అమలుజేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క సంక్షేమ కార్యక్రమమూ చేపట్టలేదని మండిపడ్డారు.
ప్రజాధనం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ప్రధాన బాధ్యత యువత, విద్యార్థులపై ఉందని చెప్పారు. విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ హక్కుల కోసం పోరాడుతున్న వారిపై కేసులు నమోదు చేయడం హేయమైన చర్యన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తామని చెప్పారు. చంద్రబాబు సర్కార్పై రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 42వ డివిజన్ యువజన విభాగం అధ్యక్షుడిగా గౌతమ్ను, విద్యార్థి విభాగానికి అశోక్ను నియమించారు. పార్టీలో చేరిన వారిలో శశి, వెంకటరెడ్డి, టోని, సన్నీ, చింటు, సుభాని, సతీష్, సాగర్, ఫిలిఫ్ ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీ, జిల్లా కార్యదర్శులు వినోద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.


